కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ గడువు శనివారం ముగిసింది.
నంద్యాల ఉపఎన్నికలో 30 మంది నామినేషన్
Aug 6 2017 1:16 AM | Updated on Oct 19 2018 8:11 PM
నూనెపల్లె: కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. మొత్తం 30 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లు దాఖలుచేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ తెలిపారు. నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల 29 నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టినట్లు తెలిపారు. 30 మంది అభ్యర్థుల్లో 13 మంది ఇండిపెండెంట్లు కాగా, 17 మంది రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉన్నట్లు చెప్పారు. నామినేషన్లను సోమవారం పరిశీలించి, ఉపఎన్నిక బరిలో ఉండే అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఉపఎన్నికలో 10,212 మంది కొత్త ఓటర్లు
నంద్యాల ఉప ఎన్నికలో 10,212 మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల అధికారులు ఈ ఏడాది జనవరిలో విడుదలచేసిన ఓటర్ల జాబితాలో 2,09,609 మంది ఉన్నట్లు నిర్ధారించారు. అయితే.. ఆ తర్వాత నూతనంగా ఓటర్ల నమోదుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ–రిజిస్ట్రేషన్, మాన్యువల్గా 15,734 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 10,212 మందిని అర్హులుగా నిర్ధారించిన ఆధికారులు.. మరో 5,522 దరఖాస్తులు బోగస్గా గుర్తించి పక్కన పెట్టేశారు. కొత్త ఓటర్లతో కలిపి మొత్తం 2,19,821 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొననున్నారు.
Advertisement


