పూలు ముళ్లు | 2013 year, many sweet sensations | Sakshi
Sakshi News home page

పూలు ముళ్లు

Dec 31 2013 4:03 AM | Updated on Sep 2 2017 2:07 AM

పూలు ముళ్లు

పూలు ముళ్లు

కాలం నిత్య సంచారి. ‘నిన్న నుంచి ‘నేటి’ మీదుగా ‘రేపటి’కి నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఎన్నెన్నో జ్ఙాపకాలను, అనుభవాలను మిగులుస్తుంది.

 కాలం నిత్య సంచారి. ‘నిన్న నుంచి ‘నేటి’ మీదుగా ‘రేపటి’కి నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఎన్నెన్నో జ్ఙాపకాలను, అనుభవాలను మిగులుస్తుంది. అలా 2013 సంవత్సరం ఎన్నెన్నో తీపి అనుభూతులను, మరెన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. అవేంటో చూద్దాం.
 - సాక్షి, రాజమండ్రి
 
 
 జనవరి
 కొత్త సంవత్సరం వరాలు కురిపిస్తుందనుకున్న సర్కారు 2013 జనవరిలో చార్జీల మోతతో స్వాగతం పలికింది. ఏప్రిల్ నెల నుంచి విద్యుత్తు చార్జీలు పెంచాలంటూ ఈ నెల ఏడున  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో వంక పదో తేదీ నుంచి  రైల్వే చార్జీలను కూడా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వస్త్రాలపై విధించిన వ్యాట్‌కు వ్యతిరేకంగా రెండో దఫా ఉద్యమానికి ఈనెల 23 నుంచి జిల్లాలోని వస్త్రవ్యాపారులు తెరలేపారు. అత్యంత అట్టహాసంగా కాకినాడ సముద్రతీరంలో బీచ్ ఫెస్టివల్‌ను  నిర్వహించారు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ జైఆంధ్రప్రదేశ్ పేరుతో సుబ్రహ్మణ్య మైదానంలో సమైక్య సభను నిర్వహించారు. 
 
 ఫిబ్రవరి
 ‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెల్‌బీ పరీక్షలను రాజమండ్రిలో రెండో తేదీన నిర్వహించారు. రైతులపై రూ.10,500 కోట్ల విద్యుత్తు బకాయిల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ మెట్ట ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపారు. జిల్లాలో ఫిబ్రవరి నెలలో విద్యుత్తు కోతలు పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. సమాచార కమిషనర్ ఎం.రతన్ రాజమండ్రిలో ప్రత్యేక కోర్టు నిర్వహించి అర్జీదారులతో నేరుగా విచారణ జరిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అఖిలభారత కార్మిక సంఘాలు ఈ నెల 21, 22 రెండు రోజులపాటు బంద్ పాటించడంతో జిల్లాలో జనజీవనం స్తంభించింది.
 
 మార్చి
 ఈ నెల నాలుగోతేదీన  అమలాపురంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వివాదాల నడుమ నలుగుతున్న పోలవరం ప్రాజెక్టుకు ఎనిమిదో తేదీన భూమిపూజ నిర్వహించారు. హెడ్ వర్కు నిర్మాణ పనులు దక్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ ప్రతినిధులు, రైతుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వ్యాట్‌కు వ్యతిరేకంగా పదో తేదీన వస్త్రవ్యాపారులు బంద్ పాటించారు. గ్రామాల విలీన సమస్యలకు తెరదించుతూ రాజమండ్రి కార్పొరేషన్‌లో 21 గ్రామాలు విలీనం చేస్తూ 18వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని రామచంద్రపురం ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 28వ తేదీన సీమాంధ్ర జిల్లాల వస్త్రవ్యాపారుల గర్జన  సదస్సు రాజమండ్రిలో జరిగింది. వ్యాట్‌ను ఎత్తివేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేయడంతో 30వ తేదీన వస్త్ర వ్యాపారులు సమ్మె విరమించారు.
 
 ఏప్రిల్
 రాజమండ్రిలో 21 గ్రామపంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీఓపై ఈ నెల ఒకటిన హైకోర్టు స్టే విధించింది. ఈ నెల ఒకటినుంచి పెరిగిన విద్యుత్తు చార్జీలు అమల్లోకి రావడంతో ఫలితంగా జిల్లాలో 16 లక్షల మంది వినియోగదారులపై పెనుభారం పడింది. పెంచిన విద్యుత్తు చార్జీలకు నిరసనగా జిల్లావ్యాప్తంగా ఐదో తేదీ నుంచి ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఎనిమిదో తేదీన అన్నివర్గాలు సంపూర్ణంగా బంద్ పాటించాయి. మూడోవారంలో బంగారం ధరలు పడిపోవడంతో జిల్లావ్యాప్తంగా మార్కెట్‌లు కిటకిటలాడాయి.
 
 మే
 2011 జనాభాలెక్కల తుది నివేదిక విడుదలైంది. జిల్లా జనాభా 51,54,296గా అధికారులు ప్రకటించారు. మే 12న 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు తల్లడిల్లారు. పరిశ్రమలకు విధిస్తున్న పవర్‌హాలీడేను జూన్ నెలవరకూ పొడిగిస్తూ ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
 జూన్
 
 గోదావరి నదిపై రాజమండ్రి-కొవ్వూరును కలుపుతూ బ్రిటిష్ కాలంలో 1897లో నిర్మితమైన హేవ్‌లాక్ వంతెన పరిరక్షణకోసం ఈ నెల మొదటివారం నుంచి ఉద్యమం ఊపందుకుంది. అన్నివర్గాల వారు తమ తమ పంథాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ నెల మూడు నుంచి 15వ తేదీ మధ్యలో ఉత్తరకాశీ యాత్రకు వెళ్లిన జిల్లాకు చెందిన 300 మంది ప్రయాణికులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వారంరోజుల తర్వాత వారంతా సురక్షితంగా జిల్లాకు చేరుకున్నారు.
 
 జూలై
 ఈ నెల ఒకటిన గవర్నర్ నరసింహన్ రాజమండ్రిలో ఒక వ్యక్తిగత కార్యక్రమాలకోసం పర్యటించారు. తన అత్తగారి అస్తికల నిమజ్జనను పుష్కరాలరేవులో నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఆన్‌లైన్ విధానానికి రెండోతేదీ నుంచి శ్రీకారం చుట్టారు. రిజిస్ట్రేషన్ శాఖ రాజమండ్రి జిల్లాలో 19 కార్యాలయాలను ఆన్‌లైన్‌ద్వారా అనుసంధానం చేశారు. ఈ నెలలో గోదావరికి రికార్డుస్థాయిలో మూడోప్రమాద హెచ్చరిక దశ దాటి 17 న్నర  అడుగుల వరకూ వరదచేరి వెనక్కు తగ్గింది. తెలంగాణ  ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జిల్లాలో 31వ తేదీనుంచి సమైక్య ఉద్యమం రాజుకుంది. 
 ఆగస్టు
 రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సకలజనులు నిరవధిక బంద్‌ను ఒకటోతేదీనుంచి ప్రారంభించారు. ఏడాదిమొత్తం మీద ఎన్నడూలేనంతగా ఉల్లి ధరలు ఆగస్టు 10 నుంచి రూ.70 కిలో రికార్డుస్థాయిని తాకాయి. ఈ నెల ఏడోతేదీన  ట్యునీషియాకు చెందిన ఒక భారీ నౌక కాకినాడ కోరమండల్ ఫెర్టిలైజర్స్‌కు ఫాస్ఫరిక్ యాసిడ్‌తో రవాణ  చేసేందుకు కాకినాడ తీరానికి చేరుకుంది. నౌకలోని యాసిడ్‌ను పైప్‌లైన్ల ద్వారా ఫెర్టిలైజర్‌కు తరలించారు. పోర్టు చరిత్రలో యాసిడ్ రవాణ  ఇదే ప్రథమం. నెలరోజులూ జిల్లాలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. 
 
 సెప్టెంబర్
 ఈ నెల రెండోతేదీ నుంచి ఉపాధ్యాయులు సమైక్య సమ్మెలో చేరారు. 11 తేదీ అర్ధరాత్రి నుంచి విద్యుత్తు ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మె బాటపట్టడంతో రవాణాకు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లాలో అంధకారం అలుముకుంది. ఈ నెల 18కి ఉద్యమం 50 రోజులు పూర్తిచేసుకుంది.  
 
 అక్టోబర్
 
 
 66 రోజులపాటు సమైక్య ఉద్యమాన్ని చేపట్టిన సుమారు 60 వేల మంది ఉద్యోగులు ఈ నెల 18 నుంచి విధుల్లోకి తిరిగి హాజరయ్యారు. ఈ నెల 21 నుంచి భారీగా కురిసిన వర్షాలు రికార్డు స్థాయిలో వర్షపాతాన్ని నమోదు చేశాయి. 350 మిల్లీమీటర్లకు పైగా వారం రోజుల్లో నమోదవడం ఐదేళ్లలో రికార్డు. జిల్లాలో సమైక్య ఉద్యమం నెలంతా కొనసాగింది. అన్నవరంలో సత్యదేవుని వ్రతం టిక్కెట్ల ధరను పెంచుతూ దేవస్థానం నిర్ణయం పట్ల భక్తుల్లో నిరసన వ్యక్తమవుతోంది. 
 
 నవంబర్
 తెల్లకార్డులకు ఇచ్చే రేషన్‌లో నవంబరు నెలలో 15 శాతం కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై జిల్లావ్యాప్తంగా కార్డుదారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా డెల్టా ఆధునికీకరణ పనులు లేనట్టేనని 15వ తేదీన కలెక్టర్ ఆధ్వర్యంలో సాగునీటి సలహామండలి తేల్చిచెప్పడం రైతులకు నిరాశకు గురిచేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి హెలెన్ తుపాను జిల్లాను గడగడలాడించింది. అనంతరం 24 నుంచి లెహర్ తుపాను ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలతో తీరప్రాంతవాసులు గడగడలాడారు. లెహర్ ముప్పు తప్పినా రెండు తుపాన్లూ తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 
 
 డిసెంబర్
 మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను చెల్లింపునకు ‘ ఈ’ చెల్లింపు విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తెలంగాణ బిల్లులు కేబినెట్ ఆమోదించడంతో జిల్లాలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆరో తేదీ నుంచి రెండు రోజులు బంద్ పాటించారు. కాకినాడలో ఇండియన్ కోస్టుగార్డు అమ్ములపొదిలో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న రాజ్‌ద్వజ్ అనే నౌక 17వ తేదీన వచ్చి చేరింది. చెన్నై నుంచి విశాఖ మధ్య తీరాన్ని ఈ నౌక గస్తీ కాస్తుంది. పండుగ సీజన్‌కావడంతో రాజమం డ్రి, కాకినాడల్లో 21వ తేదీ నుంచి కొత్త వస్త్ర నిలయాల ప్రారంభోత్సవాలు చోటుచేసుకున్నాయి. వీటిలో పాల్గొనేందు కు జిల్లాకు సినీ తారలు తరలివచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement