
173 మద్యం షాపుల కేటాయింపు వాయిదా
మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 173 మద్యం షాపుల కేటాయింపును వాయిదా వేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ మురళీ ప్రకటించారు.
- కోర్టు ఉత్తర్వుల మేరకు జేసీ అధికారిక ప్రకటన
- నిర్వహణ తేదీ త్వరలో ప్రకటిస్తామని వెల్లడి
మచిలీపట్నం : మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 173 మద్యం షాపుల కేటాయింపును వాయిదా వేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ మురళీ ప్రకటించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శనివారం మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలోని మద్యం షాపులను లాటరీ పద్ధతిన కేటాయించే ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది.
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని షాపుల కేటాయింపు వాయిదా వేశారు. వాటి కేటాయింపు తేదీని త్వరలో ప్రకటిస్తామని జేసీ చెప్పారు. దీంతో విజయవాడ ఈఎస్ పరిధిలో షాపుల కేటాయింపు ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించారు. హైకోర్టు ఉత్తర్వులు తమకు అందలేదని, మద్యం షాపుల కేటాయింపు యథాతథంగా జరుగుతుందని ఎక్సైజ్ అధికారులు శనివారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు చెబుతూ వచ్చారు.
మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని మద్యం షాపుల కేటాయింపును లాటరీ పద్ధతిలో కేటాయించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే జేసీ మురళీ మధ్యాహ్నం 2 గంటలకు మచిలీపట్నం ఈఎస్ పరిధిలోని అన్ని మద్యం షాపుల కేటాయింపును వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించటంతో సస్పెన్స్కు తెరపడింది.