కడప సెవెన్రోడ్స్ : తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పిలుపులో భాగంగా మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మికులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. తొలుత మహావీర్ సర్కిల్ నుంచి ర్యాలీగా వచ్చారు. అప్పటికే ప్రధాన ద్వారాలను పోలీసులు మూసివేశారు. దీంతో ఆందోళనకారులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.వేణుగోపాల్, కేసీ బాదుల్లా మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం కాకుండా అంబానీ, ఆదాని లాభాల కోసమే పనిచేస్తున్నాయంటూ విమర్శించారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఇటీవల 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఖండించారు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగా సురేష్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మద్దిలేటి, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీరాములు, ఉపాధ్యక్షులు లింగన్న, చాన్బాషా, కార్యదర్శులు వెంకట రమణ, కల్పన, నగర అధ్యక్షులు కల్పన యూనియన్ నాయకులు పాల్గొన్నారు.


