చాపాడు : మైదుకూరు –ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని చాపాడు మండలం నాగులపల్లె గ్రామ సమీపంలో ప్రొద్దుటూరు వైపు వెళ్లే దారిలో శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నాగులపల్లె సమీపంలోని రైస్ మిల్లు ఎదురుగా ప్రొద్దుటూరు వైపు వెళుతున్న 50 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తిని వాహనం ఢీకొనగా.. అక్కడికక్కడే మృతి చెందినట్లు చాపాడు పోలీసులు తెలియజేశారు. మృతుడి ఒంటిపై తెల్లటి చొక్కా, ఎర్రటి లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వారు తెలియజేశారు. మృతుడి ఆచూకీ గుర్తించేందుకు వారు చర్యలు చేపట్టారు.
ఆర్టీసీ శానిటేషన్ కార్మికురాలికి తీవ్ర గాయాలు
కడప అర్బన్ : కడప నగరంలోని ఆర్టీసీ డిపోలో వెల్లటూరు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు కిందపడిన ప్రమాదంలో నాగేశ్వరి (42) అనే శానిటేషన్ కార్మికురాలు తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళితే... పెండ్లిమర్రి మండలం వెల్లటూరుకు చెందిన నాగేశ్వరి, తమ గ్రామస్తులలో కొందరితో కలిసి ప్రతి రోజూ శానిటేషన్ పనులను చేసుకునేందుకు వచ్చేది. ఈనెల 9వ తేదీన రోజు మాదిరిగానే వెల్లటూరు నుంచి బస్సులో కడపకు వచ్చారు. డిపోలోకి నేరుగా బస్సును డ్రైవర్ తీసుకుని వెళ్లాడు. అందరూ దిగగానే ముందుకు కదిలారు. నాగేశ్వరి మాత్రం దిగిన సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యం వలన బస్సు కిందపడటంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను మెరుగైన వైద్య సహాయం కోసం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కడప ఎడ్యుకేషన్ : జీవశాస్త్ర బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, విద్యార్థులకు క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థమయ్యేలా చేయడానికి ఏపీ బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం (ఏపీబీఎస్టీఎఫ్) రూపొందించిన అధికారిక వెబ్సైట్ www.apbrtf.onine విద్యార్థులకు ఒక వరం అని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ అన్నారు. సంబంధిత వెబ్సైట్ను శుక్రవారం ఆయన సైన్సు ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో వినియోగించుకోవడంలో ఏపీబీఎస్టీఎఫ్ ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీబీఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.ఎ.విజయ ప్రసాద్, జిల్లా సైన్స్ మ్యూజియం క్యూరేటర్ ఎస్.ఎం.రెహమాన్, ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ సాంబ శివారెడ్డి, ఏపీబీఎస్టీఎఫ్ ప్రధాన కార్యదర్శి జి.రామ్మోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. శ్రీనివాసులరెడ్డి, జిల్లా సాంకేతిక సభ్యులు బాలకృష్ణ, సురేంద్రబాబు, మహిళా కార్యదర్శి విజయేశ్వరి, జీవశాస్త్ర ఉపాధ్యాయులు బి.సుజాత, బి.దీప, సోమకల, సూర్య చంద్రారెడ్డి, కె.నాగార్జున, అంకన్న, రమణ, అరుణకుమారి, ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బి.మహేశ్వర్రెడ్డి, జిల్లా నాయకులు బి.గంగాధర్, టి.నిత్యానందరెడ్డి, బాలాజీ, కృష్ణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


