
సదస్సుకు హాజరైన విద్యార్థులు, మేధావులు తదితరులు
వైవీయూ: విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు, ప్రాధాన్యత ఫలితాలు..రానున్న రోజుల్లో కనిపిస్తాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సుస్థిరమైన అభివృద్ధి సాధిస్తోందని పలువురు వక్తలు, యువత పేర్కొన్నారు. కడప లోని అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శుక్రవారం ‘ఓపెన్ మైండ్స్’(ఫార్ బెటర్ సొసైటీ) స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ‘విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో వినూత్న మార్పులు – సుస్థిర అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్’అన్న అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఓపెన్ మైండ్స్ సంస్థ ప్రెసిడెంట్, ఏపీ ఉన్నతవిద్య మానిటరింగ్ కమిటీ పూర్వపు సీఈఓ, మెంబర్ సెక్రటరీ డాక్టర్ ఎన్. రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రజాహిత కార్యక్రమాలు, సమస్యలపై పోరాటం, అవగాహన కల్పించడమే లక్ష్యంగా, ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఏర్పాటైన సంస్థ ఓపెన్ మైండ్స్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన గొప్ప మార్పులు, సంస్కరణలపై అవగాహన కల్పించడంతో పాటు ఏవైనా పొరపాట్లు, సవరణలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే లక్షమన్నారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాల కాలంలో ఎక్కువగా పారిశ్రామీకరణ, వ్యవసాయ రంగాలకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. విద్య, వైద్య, సంక్షేమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అయినప్పటికీ కొందరు ఈ రంగాలకు ప్రాధాన్యతను ఇవ్వడాన్ని విమర్శించడం సరికాదన్నారు, ప్రజలు, యువత, మేధావులు సరైన దిశగా సానుకూల ధృక్పథంతో ఆలోచన చేసి, జరుగుతున్న అభివృద్ధిపై విశ్లేషించుకోవాలన్నారు.విద్యపై పెడుతున్న ఖర్చును పెట్టుబడిగా భావించాలని రానున్న రోజుల్లో అత్యున్నత మానవవనరులను, మేధోసంపత్తిని దేశం పొందుతుందన్నారు.వైద్యరంగంలో ఆరోగ్యశ్రీకి మహానేత వైఎస్ఆర్ శ్రీకారం చుడితే.. దాన్ని సీఎం వైఎస్ జగన్ మరింత బలోపేతం చేస్తూ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ వంటి పథకాలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారన్నారు. ఇప్పటి వరకు 11 మెడికల్ కళాశాలలు ఉండగా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చట్టడం, దాదాపు 6వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి రానుండటం ఇవన్నీ అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్న రంగం సంక్షేమరంగమన్నారు. ఉచితాలు ఇస్తున్నారని విమర్శలు చేసేవారు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో 1.25 లక్షల సచివాలయ ఉద్యోగాలు, 2 లక్షల మంది వలంటీర్లను ఏర్పాటు చేసి గాంధీజీ కలలు కన్న సుపరిపాలనను గ్రామస్థాయికి తీసుకువెళ్లడం కన్నా అభివృద్ధి ఏముంటుందని ప్రశ్నించారు. వైవీయూ తెలుగుశాఖ ఆచార్యులు డా. ఎన్. ఈశ్వరరెడ్డి, విశ్రాంత ఆచార్యులు డా. గులాంతారీఖ్, కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్రెడ్డి, శ్రీహరి డిగ్రీ కళాశాల అధినేత జి. సుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు ఎస్.వి. డిగ్రీ కళాశాల అధినేత హరినారాయణ పాల్గొన్నారు.
విద్య, వైద్యం, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులు
‘ఓపెన్ మైండ్స్’సెమినార్లో వక్తలు

మాట్లాడుతున్న ఓపెన్మైండ్స్ అధ్యక్షుడు డా. ఎన్. రాజశేఖరరెడ్డి