అర్హులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి

Aug 31 2026 9:39 AM | Updated on Aug 31 2026 9:39 AM

భువనగిరిటౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత సామాజిక భద్రతా పింఛన్ల కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో, భర్తతో విడిపోయి ఏడాది గడిచిన ఒంటరి మహిళలతో పాటు అవివాహిత మహిళలు (గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణాల్లో 35 ఏళ్లు పైబడిన వారు) దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దివ్యాంగులు సదరం లేదా యూడీఐడీ పత్రం ద్వారా 40 శాతం (వినికిడి లోపం ఉన్నవారికి 51 శాతం) వైకల్యం ఉండాలని, తలసేమియా, సికిల్‌ సెల్‌ డిసీస్‌, హీమోఫీలియా బాధితులు కూడా అర్హులని తెలిపారు. 50 ఏళ్లు పైబడిన కల్లుగీత, చేనేత కార్మికులు సంబంధిత శాఖల ధవీకరణ పత్రాలతో, గ్రేడ్‌–2,3, ఫైలేరియా బాధితులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తు ఫారాలను cheyutha.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. నింపిన దరఖాస్తులను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలకు, పట్టణ ప్రాంతాల్లో వార్డు అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.

సామూహిక గృహప్రవేశాలకు పకడ్బందీ ఏర్పాట్లు

భువనగిరిటౌన్‌ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెంలో సోమవారం నిర్వహించనున్న సామూహిక గృహప్రవేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు సంబంధిత అధికారులకు సూచించారు. ఆదివారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహప్రవేశాల సన్నాహక ఏర్పాట్లు, లబ్ధిదారులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరయ్యే లబ్ధిదారులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలన్నారు. కాలనీలో నిరంతర తాగునీటి సరఫరా, విద్యుత్‌ దీపాల అమరికతో పాటు పారిశుద్ధ్య పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. భువనగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తంగళ్లపల్లి శ్రీవాణి, గృహనిర్మాణ శాఖ పీడీ (హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌) అలివేలు, మున్సిపల్‌, గృహనిర్మాణ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

యూజీసీ నెట్‌–జేఆర్‌ఎఫ్‌లో మేస్త్రీ కూతురి సత్తా

98.4 పర్సంటైల్‌ సాధించిన శ్రీవిద్య

మోత్కూరు : మోత్కూరుకు చెందిన బోడ శ్రీవిద్య ఇటీవల వెలువడిన యూజీసీ నెట్‌–జేఆర్‌ఎఫ్‌ ఫలితాల్లో 98.4 పర్సంటైల్‌ సాధించి విశేష ప్రతిభ చాటింది. మోత్కూరుకు చెందిన మేస్త్రి బోడ శ్రీరాములు కుమార్తె అయిన శ్రీవిద్య ఈ ఘనత సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివిన ఆమె రాయ్‌పూర్‌లోని ఐజీకేవీలో ఎంఎస్సీ పూర్తి చేసింది. సెట్‌లో 6వ ర్యాంకు సాధించిన ఆమె.. ప్రస్తుతం అదే ఐజీకేవీలో జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌ విభాగంలో పీహెచ్‌డీ చేస్తోంది. 2025లో ఏఎస్‌ఆర్‌బీ నెట్‌, యూజీసీ నెట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత సాధించిన శ్రీవిద్య.. తాజాగా యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌లో 98.4 పర్సంటైల్‌ సాధించి సత్తా చాటింది. భవిష్యత్తులో ఐఏఎస్‌ అధికారిగా ఎంపికై ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని శ్రీవిద్య వెల్లడించింది. ఉపాధ్యాయులు ఆమెకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement