రామన్నపేట: అనుమతులు లేకుండా తయారు చేస్తున్న అల్లం పేస్ట్ నిల్వలను స్వాధీనం చేసుకుని, తయారీ యూనిట్పై రామన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రామన్నపేటలో ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యాన్ను ఆపి తనిఖీ చేశారు. ఆ వ్యాన్లో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్దమొత్తంలో 360 ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసి ఉన్న అల్లం పేస్ట్ లభ్యమైంది. దీంతో వాహన డ్రైవర్ శ్యామల సాగర్ను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ లభ్యమైన అల్లంపేస్ట్ను కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలోని యూనిట్లో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సంబంధిత తయారీ కేంద్రంలో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో కల్తీ అల్లం పేస్ట్ను తయారు చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అల్లంపేస్ట్ తయారీకి ఉపయోగిస్తున్న ముడి పదార్థాలు, యంత్రాలతో పాటు పెద్ద మొత్తంలో మూడు డ్రమ్ముల్లో నిల్వ చేసిన ఉన్న అల్లంపేస్ట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ అల్లం తయారు చేస్తున్న యూనిట్ నిర్వాహకుడు దామోదర్రెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామన్నపేట సీఐ రవి, ఎస్ఐ సతీష్ తెలిపారు.


