కోదాడరూరల్ : కారు టైర్ పేలి బోల్తా కొట్టింది. అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని డీమార్ట్ సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. విజయవాడకు చెందిన ఐదుగురు వ్యక్తులు కారులో యాదగిరిగుట్ట దైవదర్శనానికి బయలుదేరారు. కోదాడకు చేరుకున్నాక కారు టైరు పేలడంతో అదుపుతప్పి పల్టీ కొట్టింది. కారులో ఉన్న వారు స్వల్పగాయాలతో బటయపడిన కొద్దిసేపటికి సీఎన్జీ గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే సమయానికి కారు పూర్తిగా దగ్ధమైంది. స్వల్పంగా గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పట్టణ పోలీసులు తెలిపారు.
● సీఎన్జీ లీకై చెలరేగిన మంటలు


