
గురుకులాల్లో వంటకు తంటా..
జీఓ 17ను నిరసిస్తూ కేటరింగ్ కాంట్రాక్టర్ల సమ్మెబాట
ఫ వంట సిబ్బంది సైతం విధులకు గైర్హాజరు
ఫ విద్యార్థులకు సమయానికి అందని అల్పాహారం, భోజనం
ఫ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సాక్షి,యాదాద్రి: విద్యార్థులే వంట మనుషులుగా మారారు. స్వయంగా వంటలు చేసి వారే వడ్డించుకున్నారు. అల్పాహారం, గురుకులాల్లో వంట కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన జీఓ 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు, కస్తూరిబాగాంధీ విద్యాలయాల్లో భోజనం వండి వడ్డించే కాంట్రాక్టర్లు సమ్మెలోకి వెళ్లారు. దీంతో బుధవారం విద్యార్థులకు సమయానికి అల్పాహారం, భోజనం అందలేదు.
కొత్త టెండర్ విధానం..
ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచి నూతన టెండర్ విధానం అమల్లోకి తెచ్చింది. కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్, పాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లు రూ.లక్షల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి జీఓ 17 జారీ చేసింది. ఇప్పటికే బిల్లులు సకాలంలో అందక కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. అప్పులు చేసి వస్తువులు సరఫరా చేస్తుసన్నారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓ కాంట్రాక్టర్లకు ఆర్థికంగా మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది. పాత నిబంధనల ప్రకారమే టెండర్లు పిలవాలని కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కేటరింగ్ కాంట్రాక్టర్లు సమ్మెలోకి దిగారు.
విధులకు రాని వంట సిబ్బంది
కేటరింగ్ కాంట్రాక్టర్లు సమ్మెలోకి దిగడంతో వంట సిబ్బంది విధులకు హాజరు కాలేదు. భువనగిరి, రాజాపేట, ఆలేరు, బీబీనగర్ సోషల్ వెల్ఫేర్, ఆలేరు, మోటకొండూరు, బీబీనగర్, దేశ్ముఖి బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో సిబ్బంది హాజరు తగ్గింది. హాజరైన ఒకరిద్దరికి తోడుగా బయటినుంచి మహిళలను కూలికి రప్పించి వంటలు చేయించారు. కొన్ని చోట్ల వాచ్మన్లు, అటెండర్లు, స్కావెంజర్లతో, మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులే వంటలు చేసి స్వయంగా భోజనం వడ్డించుకున్నారు. చాలా చోట్ల ఉదయం అల్పాహారం చేయలేదు. జావాకాచి పోశారు. విద్యార్థుల భోజనానికి ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నుంచి ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేయడంతో తాత్కాలికంగా కొంతమంది వర్కర్లను తీసుకుంటున్నారు.
నిలిచిపోనున్న సరుకులు!
ప్రస్తుతం గురుకులాల్లో కిరాణ సరుకులు సరిపడా ఉన్నాయి. అయితే విద్యార్థులకు వారంలో రెండు దఫాలు చికెన్, మటన్తో భోజనం పెట్టాలి. తాజా పరిస్థితులు చూస్తుంటే సరుకులు నిలిచిపోయే అవకాశం కనిపిస్తుంది.