
ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలి
మునగాల: రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య డిమాండ్ చేశారు. గురువారం మునగాల మండలంలోని కొక్కిరేణి గ్రామంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమిలేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12వేల ఆర్తికసాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చి.. 16నెలలు గడుస్తున్నా నేటికీ ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని, భూభారతిలో అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ సర్వేను వెంటనే రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ప్రభుత్వ భూములన్నింటిని పేద వ్యవసాయ కార్మిక కుటుంబాలకు పంచాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు కొదమగుండ్ల నగేష్, జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సొంపంగు జానయ్య, పోసనబోయిన హుస్సేన్, గుంజ వెంకటేశ్వర్లు, షేక్ సైదా హుస్సేన్, నారసాని వెంకటేశ్వర్లు, జంపాల స్వరాజ్యం, గుండు సైదులు, ఆరె రామకృష్ణారెడ్డి, దోసాపాటి భిక్షం పాల్గొన్నారు.
ఫ వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య