
భక్తులకు అభిషేక జల సంప్రోక్షణ, హారతి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి ప్రధానాలయంలో అభిషేక జల సంప్రోక్షణ, హారతి ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆలయ ప్రధానార్చకులకు, అధికారులకు ఈఓ వెంకట్రావ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆలయ అధికారులు, అర్చకులతో ఈఓ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్వామివారి అంతరాలయములో వెళ్లే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులను ధరిస్తేనే అనుమతి ఇవ్వాలని సూచించారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో శని, ఆదివారాల్లో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శన సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులు స్వయంగా వస్తేనే ప్రొటోకాల్ దర్శనం కల్పించబడుతుందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రొటోకాల్ దర్శనము వారందరూ టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. భక్తుల్లో భక్తి భావం పెంపొందించేందుకు శ్లోకములు, వాటి అర్థాలను వివరిస్తూ బోర్డులు, పెయిటింగ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా దేవస్థాన భద్రతకు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీఎఫ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈఓ భాస్కర్శర్మ, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అధికారులు దయాకర్రెడ్డి, రామారావు, రాజన్బాబు, ఎస్పీఎఫ్ ఆర్ఐ శేషగిరిరావు తదితరులున్నారు.
ఫ ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన
యాదగిరిగుట్ట ఈఓ వెంకట్రావ్