
రెగ్యులర్ పద్ధతిన నియామకాలు చేపట్టాలి
యాదగిరిగుట్ట: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో పనిభారం తగ్గించేందుకు గాను ఖాళీగా ఉన్న పోస్టుల్లో రెగ్యులర్ పద్ధతిన నియామకాలు చేపట్టాలని టీఎన్జీఓల సంఘం సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీష్ ప్రభుత్వాన్ని కోరారు. యాదగిరిగుట్టలోని పాత గోశాలలో గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల ఉద్యోగులు, సిబ్బంది సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన దేవాలయాల ఉద్యోగులకు హెల్త్ కార్డులు, పీఆర్సీ అనుమతించి, రాబోయే ప్రభుత్వ జీఓలో ప్రత్యేకంగా పొందుపరచాలన్నారు. జీఓ నంబర్ 888ను దేవాలయాల్లో ఉన్న పోస్టులకు అనుగుణంగా పూర్తి స్థాయిలో సవరణ చేయాలని, జీఓ నంబర్ 261ని సవరించాలన్నారు. పదవీ విరమణ దగ్గర్లో ఉన్న ఉద్యోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులను మానవతా దృక్ఫథంతో తమ తమ మాతృ సంస్థలకు బదిలీ లేదా డిప్యూటేషన్పూ పంపాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలన్నారు. అనంతరం ప్రధాన దేవాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొటున్న సమస్యల పరిష్కారం, ఉద్యోగులకు అవసరమ్యే అంశాలపై చర్చించారు. త్వరలోనే దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన దేవాలయాల ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజవెల్లి రమేష్బాబు, టీఎన్జీఓల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ ముజీబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకటేష్, ముక్కెర్ల సత్యనారాయణ, జిల్లా జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్రెడ్డి, ఆయా దేవాలయాల అధ్యక్షులు వి. శ్రీనివాస్రెడ్డి (భద్రాచలం), కూరగాయల శ్రీనివాస్ (వేములవాడ), సుదర్శన్ (బాసర), మల్లికార్జునస్వామి (కొమురవెల్లి), చందు (కొండగట్టు), దూశెట్టి కృష్ణ, దయానంద్ (యాదగిరిగుట్ట), 150 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.