
భువనగిరి ఖిలా టికెట్ ధరలు పెంపు
భువనగిరి: భువనగిరి ఖిలా సందర్శనకు టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఈ నెల 6న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం ఖిలా సందర్శనకు గాను పెద్దలకు గతంలో రూ.10 టికెట్ ఉండగా.. ప్రస్తుతం రూ. 20కు పెంచారు. అదేవిధంగా పిల్లలకు గతంలో రూ.5 టికెట్ ఉండగా.. ఇప్పుడు రూ.10కు పెంచారు. మిగిలిన ధరలు యాథావిధిగా ఉన్నాయి. గతంలో సందర్శకుల ద్వారా వచ్చిన ఆదాయం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖకు వెళ్లేది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వచ్చిన ఆదాయాన్ని మ్యూజియం నిర్వహణ, రికార్డుల నిర్వహణ కోసం ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించారు.
ప్రైవేట్ పాఠశాలల బస్సుల అడ్డగింత
ఆత్మకూర్ (ఎస్): ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని ఏపూరు గ్రామం నుంచి సూర్యాపేటలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్లే స్కూల్ బస్సులను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. లక్షల్లో ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలల బస్సులు తమ గ్రామానికి రావొద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను పిలిపించి కొందరు గ్రామస్తులు తమ పిల్లలకు ప్రభుత్వ స్కూల్లో చేర్పించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష
రామగిరి(నల్లగొండ): నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను నల్లగొండ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గురువారం ఒక రోజు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సైదాబాబు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్లు వాహనాలు నడిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భువనగిరి ఖిలా టికెట్ ధరలు పెంపు