
బాల్య వివాహాలు నేరం
భువనగిరిటౌన్ : బాల్యవివాహాలు నేరమని, పెళ్లిళ్ల సీజన్ కావడంతో నిఘా ఉంటుందని జిల్లా మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారి నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈనెల 30న సామూహిక వివాహాలు జరిపే సంప్రదాయం ఉంటుందని, మైనర్ల వివాహాలు చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1098 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా పురోహితులు, మత పెద్దలు, టెంట్ హౌస్లు, ఫంక్షన్హాళ్ల నిర్వాహకులు జాగ్రత్త వహించి బాల్యవివాహాలు సమాచారాన్ని తెలియజేయాలన్నారు. బాల్యవివాహాలు చేస్తే తల్లిదండ్రులతో పాటు పెళ్లికి హాజరయ్యే అతిథులు కూడా శిక్షార్హులన్నారు.
సమస్యలుంటే అధికారుల దృష్టికి తేవాలి
భువనగిరి : ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా సహకార అధికారి(డీసీఓ) మురళీరమణ రైతులకు సూచించారు. సోమవారం భువనగిరిలోని హుస్నేబాద్లోని కోనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు, హమాలీలతో మాట్లాడారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలకుండా ఏర్పాట్లు ఉండాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
శివపార్వతులకు సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన, ముఖ మండపంలో స్పటిక లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు.. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు.
ఆశతో వచ్చి.. నిరాశగా వెనుదిరిగి
భువనగిరిటౌన్ : కలెక్టర్లో సోమవారం జరగాల్సిన ప్రజవాణి కార్యక్రమాన్ని భూ భారతి అవగాహన సదస్సుల వల్ల రద్దు చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రజావాణి రద్దయిన విషయం చాలా మందికి తెలియక ఎప్పటి మాదిరిగానే తరలివచ్చారు. ఎండకు అవస్థలు పడుతూ సుదూర ప్రాంతాల నుంచి నిరీక్షించారు. అధికారుల సూచన మేరకు అర్జీలను ఇన్వార్డులో అందజేసి వెళ్లారు. మొత్తం 43 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
స్వర్ణగిరీశుడికి సహస్రనామార్చన
భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోమవారం ఉదయం సహస్రనామార్చన వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, తోమాల సేవ, నిత్యకల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి సేవ కార్యక్రమాలు నిర్వహించారు.

బాల్య వివాహాలు నేరం

బాల్య వివాహాలు నేరం