
పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
మిర్యాలగూడ అర్బన్: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. రైల్వే ఏఎస్ఐ బి. సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని రాంనగర్బందంకు చెందిన చల్లా లింగయ్య కుమారుడు చల్లా కళ్యాణ్(27) తనకు పెళ్లి కావడం లేదని కొంతకాలంగా తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు. బుధవారం వారి బంధువుల పెళ్లికి హాజరైన కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చాడు. గురువారం ఉదయం బైక్పై మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల వద్దకు చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఏఎస్ఐ తెలిపారు.
అప్పుల బాధతో ..
రాజాపేట: అప్పుల బాధతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజాపేట మండలం కొండ్రెడ్డిచెర్వులో గురువారం రాత్రి జరిగింది. కొండ్రెడ్డిచెర్వు గ్రామానికి చెందిన కర్రె మహేష్(28)కు అదే గ్రామానికి చెందిన కళ్యాణితో వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మహేష్ తన కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లాకు వలస వెళ్లి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో గిరాకీలు తగ్గడంతో ఆరు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఆటోలో గ్రామానికి చెందిన కూలీలతో కలిసి నిత్యం కూలీ పనికి వెళ్తూ తనకున్న 2 ఎకరాల్లో వ్యవసాయం చేసేవాడు. 5 బోర్లు వేయడం, ఇల్లు కట్టడం, కొత్త ప్యాసింజర్ ఆటో కొనడం వంటి వాటికి రూ.20 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు తీర్చేందుకు ఎకరంన్నర భూమి అమ్మాడు. పంట దిగుబడి రాక, ఆటో నడవక అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం మహేష్ భార్య కళ్యాణి అదే గ్రామంలో ఉన్న తన తల్లిగారింటికి వెళ్లింది. పనికి వెళ్లిన మహేష్ రాత్రయినా కళ్యాణి వాళ్ల తల్లిగారింటికి రాకపోయేసరికి, కళ్యాణి తమ ఇంటికి వెళ్లి చూడగా.. మహేష్ ఉరేసుకుని కనిపించాడు.
అనారోగ్యంతో వృద్ధుడు..
అడ్డగూడూరు: అనారోగంతో బాధపడుతున్న వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం కోటమర్తిలో బుధవారం రాత్రి జరిగింది. గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటమర్తి గ్రామానికి చెందిన కొంపెల్లి నారాయణ(60) కొద్దిరోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. బుధవారం సాయంత్రం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన నారాయణ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రయినా నారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం నారాయణ మనవడు వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా అక్కడ చెట్టుకు ఉరేసుకుని నారాయణ ఆత్మహత్య చేసుకుని కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యా దు అందలేదని ఎస్ఐ నాగరాజు తెలిపారు.