
కల్యాణ కట్ట పంచాయితీ
ఎలాంటి సమాచారం ఇవ్వలేదు
యాదగిరిగుట్ట ఆలయంలో 20 మంది నాయీ బ్రాహ్మణులను కొత్తగా నియమించడానికి కోర్టు ఆర్డర్ ఉందని ఈఓ చెబితే అది చూపెట్టాలని అడిగాం. కల్యాణ కట్టకు కొత్తగా ఎవరినైనా కేటాయిస్తే దేవస్థానం ఆధ్వర్యంలో మా సంఘానికి లెటర్ ఇస్తారు. కానీ ఎలాంటి కాపీ ఇవ్వలేదు. ఈఓతో పాటు కొంతమంది అధికారులు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఆర్డర్ తయారు చేసి 20 మందిని నియమించారు.
– రాచకొండ జానకిరాము,
రాష్ట్ర దేవాలయ కల్యాణ కట్ట అధ్యక్షుడు
మా కల నెరవేరింది
కల్యాణ కట్టలో విధుల్లో చేరడంతో మా కల నెరవేరింది. కల్యాణ కట్టలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న నాయీ బ్రాహ్మణులు మా నియామకాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో కేసు వేశారు. తిరిగి మేము కూడా హైకోర్టుకు వెళ్లాం. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆర్డర్ కాపీని తీసుకొచ్చి ఈఓకు ఇచ్చాం. దీంతో విధుల్లో చేర్చుకునేందుకు ఈఓ ఆదేశించారు. తోటి నాయీ బ్రాహ్మణులతో కలిసి పనిచేస్తాం.
– జంపాల రాజు, యాదగిరిగుట్ట
నాయీ బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ కట్టలో నాయీ బ్రాహ్మణుల మధ్య పాత.. కొత్త పంచాయితీ నెలకొంది. ప్రస్తుతం దేవస్థానం కల్యాణ కట్టలో 96మంది నాయీ బ్రాహ్మణులు కమీషన్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మరో 20మందిని కల్యాణ కట్టలో విధులు నిర్వహించే విధంగా దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులతో ఈఓ భాస్కర్రావు నియమించారు. ఆ 20మంది నాయీ బ్రాహ్మణులు బుధవారం విధుల్లో హాజరయ్యేందుకు కల్యాణ కట్టకు చేరుకున్నారు. దీంతో అప్పటికే కొనసాగుతున్న 96మంది వారిని అడ్డుకొని ఆందోళన చేపట్టారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ ఏఈఓతో వాగ్వాదానికి దిగారు. కోర్టు ఆర్డర్ ఉండటంతో నూతనంగా 20 మందిని కల్యాణ కట్టలో విధులు నిర్వహించేందుకు అనుమతించామని ఏఈఓ వివరించారు. అయినా ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు అక్కడి చేరుకొని సముదాయించారు. అనంతరం కోర్టు ఆర్డర్, దేవాదాయశాఖ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని చూపెట్టిన తర్వాత 20 మంది ఉద్యోగంలో చేరారు.
ఉత్తర్వుల కాపీలో ఇలా..
దేవాలయ అభివృద్ధిలో భాగంగా కొండ కింద రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు, ఇళ్లు కోల్పోయిన 33 మంది నాయీ బ్రాహ్మణులకు కల్యాణ కట్టలో పని కల్పించేందుకు కమిషన్ పద్ధతిలో తీసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో సూచించారు. ఈ మేరకు 20 మందిని అదనంగా నియమించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఫ యాదగిరిగుట్ట క్షేత్రం కల్యాణ కట్టలో కొత్తగా 20 మంది నాయీ బ్రాహ్మణుల నియామకం
ఫ ఇప్పటికే పనిచేస్తున్న వారి నుంచి అభ్యంతరం
ఫ ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన