భీమవరం: పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని గురువారం జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహంచిన ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అతి తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించడం భారంగా మారిందన్నారు. నెలకు కనీసం రూ.36 వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా మేనేజర్ ఎండీ ఇబ్రహీంకు వినతిపత్రం అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారామ్ ప్రసాద్, ఉద్యోగ సంఘం నాయకులు కొనకళ్ల వినయ్, జె.రాజేష్, ఎన్.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం డీఎస్పీగా యు.రవిచంద్ర నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ డీఎస్పీగా పనిచేస్తున్న విశ్వనాథం ఉద్యోగోన్నతిపై వెళ్లారు. భీమవరం మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీగా పనిచేస్తున్న రవిచంద్ర ఇక్కడకు వచ్చారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించగా సీఐ బి.ఆదిప్రసాద్, పట్టణ ఎస్సై బాదం శ్రీనివాసు తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.
భీమవరం: మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్టు చేయించిందని మత్స్యకార నేత, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు బంధన పూర్ణ చంద్రరావు విమర్శించారు. గురువారం భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం పతాక స్థాయికి చేరిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అరాచకాలు, అన్యాయాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో అరెస్టులు చేయించి వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతుందని, ఇందుకు నిదర్శనం మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టు అని మండిపడ్డారు. అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలతో మత్య్సకారులను అణగదొక్కాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని, గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
భీమవరం: యానిమేటర్స్ (వీఓఏ)లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ డి.కల్యాణి తెలిపారు. గురువారం వీఓఏల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అధికారి ఎ.లక్ష్మికి అందజేశారు. అనంతరం కల్యాణి, సంఘ జిల్లా అధ్యక్షురాలు గోవిందమ్మ మాట్లాడుతూ వీఓఏలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పాలకులు మారినప్పుడల్లా తమ ఉపాధికి ముప్పు వాటిల్లుతోందని, కనీస భద్రత లేదన్నారు. ధర్నా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
భీమవరం: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా పాఠశాలల బంద్కు పిలుపునిచ్చినట్టు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు యామినీ దేవిశ్రీ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు బంద్ నోటీసులిచ్చామన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా బంద్ చేపట్టామని, ఉపాధ్యాయులు సహకరించాలని ఆమె కోరారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పీజీఆర్ఎస్లో దర ఖాస్తు చేసుకున్న అర్జీదారులు క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చ ని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురు వారం కలెక్టరేట్లో క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్ బ్యాక్ ఇస్తే సంబంధిత అధికారి స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతారన్నారు. డీఆర్వో పి.ప్రభాకర్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి పాల్గొన్నారు.


