సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకుల ఇంటి ముందు ఏర్పాటుచేసిన అనధికార స్పీడ్ బ్రేకర్లను అధికారులు శుక్రవారం తొలగించారు. మండలంలోని అయితంపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉప్పులూరు లావణ్య, ఆమె భర్త వైఎస్సార్ సీపీ నాయకుడు ఉప్పులూరి జితేంద్ర మాట్లాడుతూ తమ ఇంటి ముందు నరసాపురం, అశ్వారావుపేట స్టేట్ హైవేపై జనవరిలో అధికారులు, కూటమి నాయకులు కలిసి నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్ బ్రేకర్లు వేశారని తెలిపారు. స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనంతరం లావణ్య, జితేంద్ర దంపతులు కోర్టును ఆశ్రయించగా గత నెలలో స్పీడ్ బ్రేకర్లు తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం స్పీడ్ బ్రేకర్లు తొలగించకపోతే సంబంధిత అధికారులపై తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద శుక్రవారం ఉదయం జేసీబీ సహాయంతో ఆర్ అండ్బీ అధికారులు అనధికారంగా వేసిన స్పీడ్ బ్రేకర్లు తొలగించారు.
పెదపాడు: కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న నలుగురు వ్యక్తులపై పెదపాడు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మండలంలోని వడ్డిగూడెం గ్రామానికి తెలంగాణ రాష్టంలోని సత్తుపల్లి నుంచి నిషేధిత కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు చేపల చెరువు యజమాని ఘంటసాల తిరుపతిరాజులపై కేసు నమోదు చేసినట్లు పెదపాడు ఎస్సై ఆర్.శ్రీను తెలిపారు.


