యలమంచిలి: ఏనుగువానిలంకలో ప్రభుత్వ భూ ములను ఆక్రమించి ప్రహరీలు, భవనాలు నిర్మిస్తున్నారని, దీనిపై పీజీఆర్ఎస్లో నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన నారిన వెంకటేశ్వరరావు, ముచ్చర్ల ధర్మారాజు, దేవరపు నాగబాబు ఆరోపించారు. పంచాయతీ కార్యాలయం వెనుక నుంచి దళితపేట వరకు డ్రెయినేజీ ఆక్రమణలకు గురైందని, ఇదే అదనుగా కొందరు కూటమి నాయకులు కొత్తగా షాపు నిర్మాణాలు చేపట్టారన్నారు. అలాగే గ్రామ కంఠం భూమినీ ఆక్రమించి ప్రహరీలు నిర్మించారన్నారు. ప్రస్తుతం డ్రెయినేజీ నిర్మాణానికి ప్రహరీ అడ్డువస్తున్నా పట్టించుకోకుండా డ్రెయినేజీని వంపు తిప్పుతున్నారని ఆరోపించారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని జిల్లాస్థాయి అధికారులు మండల అధికారులకు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పైగా సమస్య పరిష్కరించినట్టు జిల్లా అధికారులకు సమాచారం పంపారని, దీనిపై అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని విమర్శించారు. అలాగే గ్రామంలో పంచాయతీ అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణం, అనుతులు లేని లేఅవుట్లలో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.


