తెలుగు సాహిత్యం అజరామరం
తాడేపల్లిగూడెం: తెలుగు సాహిత్యం అజరామరమని, కంప్యూటర్ యుగంలో కూడా తెలుగు సాహిత్యానికి చోటు ఉందని రచయిత మంత్రి రవి అన్నారు. శశి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న టెక్నో కల్చరల్ ఫెస్ట్లో భాగంగా రెండో అతిథిగా మంత్రి రవి హాజరయ్యారు. శశి విద్యాసంస్ధల వైస్ చైర్మన్ మేకా నరేంద్రకృష్ణ మాటామంతి కార్యక్రమం చేశారు. అమ్మ డైరీలో కొన్ని పేజీలు రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందని అడిగారు. మంత్రి రవి స్పందిస్తూ ఐర్లాండ్లో ఉద్యోగం చేస్తున్న తరుణంలో ఒత్తిడి నుంచి బయటకు రావడానికి రచనకు ఉపక్రమించి వెబ్లో పోస్టు చేస్తుంటే వస్తున్న ఆదరణ చూసి తెలుగులో ఒక నవల రాయాలనే ఆలోచన వచ్చిందన్నారు. అమ్మ ప్రేమపై అభిప్రాయాలను సేకరించి వారి అనుభవాలతో నవల రాశానని, రెండు లక్షలకు పైగా ప్రతులు అమ్ముడు పోవడంతో, ఈ నవలను త్వరగా సినిమాగా రాబోతుందన్నారు. విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, సెక్రటరీ కరస్పాండెంట్ మేకా క్రాంతిసుధ, డైరెక్టర్ బూరుగుపల్లి రాధారాణి, ప్రిన్సిపాల్ మొహమ్మద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.


