రూ.4.94 లక్షల విలువైన పీడీఎస్ రైస్ పట్టివేత
తణుకు అర్బన్: తణుకులో అక్రమంగా నిల్వచేసిన పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని షెడ్డులో పట్టణానికి చెందిన కొల్లి బాబు నిల్వ ఉంచిన 12 టన్నుల బియ్యంతోపాటు ఒక వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని గోస్తనీ కాలువ గట్టు రోడ్డులో వ్యాన్ ద్వారా రవాణా చేస్తున్న బియ్యాన్ని అధికారులు గుర్తించి ఆరా తీసి విచారణలో భాగంగా ఒక షెడ్డులో బియ్యం నిల్వలను గుర్తించారు. రూ.4,94,520 విలువైన 7,363 టన్నుల రేషన్ బియ్యం (12,363 కిలోలు)తోపాటు వ్యాన్ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో పీడీఎస్ బియ్యాన్ని సేకరించి కాలనీలోని షెడ్డులో నిల్వచేసి పెద్ద మొత్తంలో తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. నిర్వాహకుడు కొల్లి బాబుపై 6 ఏ కేసు నమోదుచేసినట్లు తణుకు తహసీల్దార్ కార్యాలయ డీటీ శ్రీదేవి తెలిపారు.
నూజివీడు: విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో ‘విద్యార్థులు–నైతిక విలువలు’ అనే అంశంపై ఈనెల 8న నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రిపుల్ ఐటీలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. దీనిలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పాల్గొని ఉపన్యసిస్తారన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కొత్తా మధుమూర్తి, ఉప కులపతి ఆచార్య ఎం విజయ కుమార్ హాజరుకానున్నారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక పాతూరు తాడేపల్లి చెరువులో ఇటీవల వ్యర్థాలు, చెత్త చెదారాలు, ఎండిపోయిన ఆకులు, గడ్డి, గుర్రపు డెక్క బాగా పేరుకుపోయాయి. గురువారం సాయంత్రం అవి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు ఎగిసిపడటంతో చెరువును ఆనుకుని ఇళ్లు నిర్మించుకున్న స్థానికులు ఆందోళన చెందారు. మంటలు అదుపులోకి రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: కుమార్తైపె అఘాయిత్యానికి పాల్పడిన తండ్రికి కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని నీలాద్రిపురం గ్రామానికి చెందిన సురగాని రంగారావు, అతని తమ్ముడు సురగాని బుచ్చిరాజు కలిసి కుమార్తైపె అఘాయిత్యానికి పాల్పడ్డారని తల్లి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2022 సంవత్సరంలో చోటు చేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను ఏలూరు ఓపెన్ కోర్టులో హాజరుపర్చగా, బాలిక తండ్రి రంగారావుపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించడంతో రూ.10వేలు జరిమానా విధించారు. దీనితో, పాటు బాలికకు ముద్దాయి రూ.2 లక్షలు, ప్రభుత్వం రూ.3 లక్షలు చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పునిచ్చినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
తాడేపల్లిగూడెం రూరల్: కొట్లాట కేసులో నలుగురికి జరిమానా విధించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. మండలంలోని జగన్నాథపురం గ్రామంలో 2021 ఫిబ్రవరి 23వ తేదిన కొట్లాట, గొడవ జరిగింది. అప్పట్లో అడ్డాల సూర్యచంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులు రాటాల సత్యనారాయణ, రాటాల వీరవెంకట మణికంఠ దుర్గావరప్రసాద్, రాటాల వెంకట దుర్గారావు, రాటాల నారాయణస్వామిలకు ఒక్కొక్కరికీ రూ.11 వేలు చొప్పున మొత్తం రూ.44 వేలు జరిమానా విధిస్తూ రెండవ అదనపు మొదటి తరగతి కోర్టు జడ్జి అన్నామణి తీర్పు వెల్లడించారన్నారు. విచారణకు ఏపీపీ ఎ.రవిప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ ఎస్.సుబ్బారావు సహకరించినట్లు రూరల్ పోలీసులు తెలిపారు.
రూ.4.94 లక్షల విలువైన పీడీఎస్ రైస్ పట్టివేత


