తేనెటీగల పెంపకంతో స్వయం సమృద్ధి
తాడేపల్లిగూడెం: ఆదాయ వనరుగా తేనెటీగల పెంపకాన్ని ఎంచుకుంటే ఆర్థిక స్వయం సమృద్ధి సాధించవచ్చని వక్తలు పేర్కొన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న తేనెటీగల పెంపకం శిక్షణ ముగింపు కార్యక్రమం బుధవారం ముగిసింది. ఏడు రోజుల పాటు సాగిన శిక్షణలో తేనెటీగల పెంపకంలో జాగ్రత్తలు, ఎలాంటి ప్రాంతాల్లో పెంచాలి, మెళకువలు ఎలా తీసుకోవాలనే విషయాలను విశదీకరించారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ రూత్ మాట్లాడుతూ రైతులు, ఆకాంక్ష కలిగిన వారు ఇలాంటి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు తేనెటీగల పెంపకాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలన్నారు. తేనెటీగల నుంచి తేనెతో పాటు మైనం, ఇతర ఉప ఉత్పత్తులు వస్తాయన్నారు. సంప్రదాయ పెంపకం గానే కాకుండా, వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. శిక్షణలో నేర్చుకున్న శాసీ్త్రయ అంశాలను వ్యవసాయ కార్యకలాపాల్లో వినియోగించుకోవాలన్నారు. కేవీకె సమన్వయకర్త డాక్టర్ పి.విజయలక్ష్మి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఇమ్మానియేల్, డాక్టర్ ఆదర్శ, డాక్టర్లు ఉదయశ్రీ, బి.పెదబాబు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్లను అందజేశారు.


