భూ దోపిడీకి భారీ స్కెచ్
3,650 గజాలకు రూ.39 కోట్ల డీల్
సాక్షి, టాస్క్ఫోర్స్ : వందేళ్లకు పైగా గూడెంలో అందరికి తెలిసిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన భూమి అది. స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో మహాత్మాగాంధీకి భూములు విరాళాలు ఇచ్చిన కుటుంబానికి చెందిన భూమిని లీజు పేరిట ఒక వ్యక్తి తీసుకున్నాడు. అతని కుమారులు మాకు సర్వహక్కులతో విక్రయించారని, వారికి వారసులు లేరని, స్థలాన్ని ముక్కలు ముక్కలుగా విక్రయించడం మొదలుపెట్టారు. రాజకీయ నేతల కన్ను భూమిపై పడటంతో బడా మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. కట్చేస్తే... ఆ భూమిలో కొంత భాగం రోడ్డు కిందకు పోయేలా చూపించి రూ.39 కోట్ల పరిహారం పొందడానికి పకడ్బందీ స్కెచ్ గీశారు. ఆ మేరకు వచ్చే పరిహారంలో వాటాలు ఖరారు చేసుకున్నారు. పనంతా కొలిక్కితెచ్చారు. కట్చేస్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారసులు హైకోర్టులో కేసు దాఖలు చేయడంతో మొత్తం ప్రయత్నానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
తాడేపల్లిగూడెంలోని టూటౌన్ సమీపంలో సత్యనారాయణ స్వామి ఆలయ సమీపంలో కృష్ణా రైస్మిల్లు సర్వే నెంబర్ 403లో ఉంది. 5.80 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ భూమి దామోజీపురపు ముఖ్య ప్రాణారావు కుటుంబసభ్యులది. 1929లో పెంటపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ అయింది. అనంతరం తాడేపల్లిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటయ్యాక భూమి రికార్డు బదలాయింపు చేశారు. అనంతరం ప్రాణారావు 1939 జనవరి 2న తన వాటాగా వచ్చిన 5.80 ఎకరాల భూమిని 99 ఏళ్ళ లీజుకు ఒక వ్యక్తికి అప్పగించారు. కట్చేస్తే.. ముఖ్య ప్రాణారావు వారసులున్నప్పటికీ కుటుంబ సభ్యులు భూమి బాగోగులు పట్టించుకోలేదు. దీంతో లీజు తీసుకున్న వ్యక్తి ప్రాణారావుకు వారసులు లేరని దాన విక్రయ హక్కులతో తనకు లీజుకు ఇచ్చారని హడావుడి చేసి పెంటపాడు మండలానికి చెందిన ఒక డాక్యుమెంట్ రైటర్ సహకారంతో అత్తిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 26 రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. 5.80 ఎకరాల భూమిని ముక్కలు ముక్కలుగా విక్రయించారు. ఈ వ్యవహారంలో డాక్యుమెంట్ రైటర్ది కీలకపాత్ర. సబ్రిజిష్ట్రార్ కార్యాలయ ఉద్యోగులను కూడా అన్ని విధాలా సర్దుబాటు చేసి మరీ తతంగం నడిపించారు. ఇక కూటమి అధికారంలో ఉండటంతో బడానేతను సంప్రదించి మాస్టర్ ప్లాన్లో చిన్నపాటి సర్దుబాట్లతో ఈ సర్వే నెంబర్లో కొంత భూమిని ప్రభుత్వం తీసుకుని పరిహారం ఇస్తే నూరు శాతం లీగల్ అవుతుందని నిర్ణయించి పొలిటికల్ పెద్దలను ఆశ్రయించి భారీ యాక్షన్ ప్లాన్కు తెరదీశారు.
డీల్ బాగుండటంతో బడా పొలిటికల్ నేత రంగంలోకి దిగాడు. వెంటనే మాస్టర్ ప్లాన్లో భాగంగా 1500 గజాలు కేఎన్ రోడ్డులో, 2150 గజాలు భీమవరం రోడ్డు విస్తరణలో పోయేలా సెట్చేసి 40 అడుగుల రహదారిని చూపించారు. కేఎన్ రోడ్డులో 1500 గజాల భూమికి గజం రూ. 75 వేలు, భీమవరం రోడ్డులో 2150 గజాలకు గజం రూ.25 వేలు ప్రభుత్వం నిర్ణయించిన ధర. దీనికి మూడు రెట్లు పరిహారం ఖరారు చేయించుకునేలా అన్ని మంతనాలు పూర్తి చేశారు. మొత్తం రూ.39 కోట్ల పరిహారానికిగాను 40 శాతం టీడీఆర్ బాండ్ల రూపంలో మిగిలిన 60 శాతం నగదు వారి ఖాతాల్లో పడేలా సెట్ చేసుకున్నారు. దీనికిగాను బడా నేతకు 50 శాతం అంటే రూ.19.50 కోట్లు గూడెం మున్సిపాల్టీలో కీలక అధికారి ఒకరికి కోటిన్నర, మరొకరికి రూ.కోటి, మిగిలిన మొత్తం వారసులు లేరని తనకే దక్కుతుందని కాగితాలు సిద్ధం చేసిన వ్యక్తికి వచ్చేలా ప్లాన్ ఖరారు చేసుకున్నారు. ఈ వ్యవహారం ఖర్చంతా కూడా కాగితాలు సిద్ధం చేసిన వ్యక్తే భరించాలని నిర్ణయించారు. కట్చేస్తే.. మున్సిపాల్టీలో ఓ అధికారి తాను పనిచేయలేనని సెలవులో వెళ్ళినట్లు సమాచారం. భూ పంచాయతీపై హడావుడి తెలుసుకున్న దామోజీపురపు కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దామోజీపురపు భారతి, మరో నలుగురు కలిసి హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 35154/2025 నెంబరుతో కోర్టులో కేసు దాఖలు చేశారు. మాస్టర్ ప్లాన్ పేరిట టీడీఆర్ బాండ్ల ఇచ్చే ప్రక్రియ నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించిన క్రమంలో వ్యవహారం నిలిచిపోయింది. రెవెన్యూ రికార్డులోని ఆర్ఎస్ఆర్ను, ఇతర పత్రాలను అధికారం ఉన్న బడా నేత సాయంతో సవరణలు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
గూడెంలో బ్రాహ్మణ వారసత్వ ఆస్తిపై బడా నేత కన్ను
40 అడుగుల రోడ్డు విస్తీర్ణంలో 3,650 గజాలు ప్రభుత్వానికి
దానికిగాను రూ.39 కోట్ల పరిహారం
సగం పరిహారం బడా నేతకు ఖరారు
మున్సిపల్ అధికారులకు రూ.2.50 కోట్ల భారీ నజరానా
మిగిలిన మొత్తం మరికొందరికి
హైకోర్టు ఉత్తర్వులతో తాత్కాలికంగా బ్రేక్
భూ దోపిడీకి భారీ స్కెచ్


