రాష్ట్రంలో రాజ్యాంగం అమలులో ఉందా?
వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం కన్వీనర్ వడ్డి రఘురాం
తాడేపల్లిగూడెం : తిరుమల లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని సిట్ తేల్చినా.. కలియుగదైవం వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగడం విచారకరమని గూడెం వైఎస్సార్సీపీ కన్వీనర్ వడ్డి రఘురాం విమర్శించారు. టీటీడీ చైర్మన్లుగా గతంలో పనిచేసిన వైవీ.సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డి వంటి వారిపై దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయడం వల్ల ప్రజల్లో ఆందోళన కలుగుతుందన్నారు. ఇంతకు ముందు నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా వెనుక ఉన్న ఆలీబాబా ఎవ్వరని ప్రశ్నించారు. చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి క్షమాపణలు చెప్పారని, అంతకు ముందు మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బాబు క్షమాపణ చెప్పారా? అని ప్రశ్నించారు. అంబటి దాడి, జోగి ఇంటిపై పెట్రోలు బాంబుల దాడులు చూస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగం అమలులో ఉందా, ఏ రాజ్యాంగాలు నడుస్తున్నాయని ప్రశ్నించారు. దేవుడి పేరుతో పబ్బం గడుపుకోవాలని పాలకులు చూస్తున్నారని, వారికి ఎలాంటి గుణపాఠం చెబుతారో దేవుడిపై వదిలేశామన్నారు. అనంతరం పట్టణ ఇన్చార్జి సీఐ రవికుమార్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమానికి ముందు సవితృపేటలోని తన నివాసం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. కేఎన్ రోడ్డు మీదుగా బయలుదేరిన ర్యాలీ పట్టణ పోలీసు స్టేషన్ వరకు సాగింది. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.


