సాక్షి, భీమవరం: ప్రభుత్వ ఆస్పత్రులకు కూటమి సర్కారు నిర్లక్ష్య రోగం పట్టింది. సమ య పాలన పాటించని వైద్యులు.. అరకొర మందులు.. వైద్య సిబ్బంది కొరత.. సౌకర్యాల లేమి.. రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి.. ఓపీ వద్ద నుంచే పడిగాపులు మొదలవుతున్నాయి. అడుగడుగునా సమస్యలతో అత్యవసర వైద్యం గగనమవుతోంది. సోమవారం జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో సకాలంలో వైద్యులు రాక రోగుల పడిగాపులు, సిబ్బంది కొరతతో వారంలో మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్న ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, దీర్ఘ కాల వ్యాధులకు చెందిన మందులు సైతం అందుబాటులో లేని పరిస్థితులు, పారిశుద్ధ్య లేమి తదితర వెతలెన్నో వెలుగుచూశాయి.
తణుకు.. ‘ఓపి’క పట్టలేక : తణుకులోని జిల్లా కేంద్ర ఆస్పత్రి 200 పడకలతో సేవలందిస్తున్నా 100 పడకలకు చెందిన వైద్య సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఓపీ వద్ద నుంచే రోగులను కష్టాలు వెంటాడుతున్నాయి. డేటా ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యమై క్యూలైన్లో నిల్చోలేక కూలబడిపోతున్నారు. హెల్ప్డెస్క్ లేక ఏ పరీక్షకు ఎక్కడకు వెళ్లాలనే విషయం తెలియక తికమకపడుతున్నారు. పూర్తిస్థాయిలో చీపుర్లు, బ్లీచింగ్ పౌడర్, చేటలు, బయోమెడికల్ కవర్స్, శానిటరీ సామగ్రి సరఫరా లేక తరచూ పారిశుద్ధ్య లేమి పరిస్థితులు తలెత్తుతు న్నాయి. ఇరగవరం, రేలంగి పీహెచ్సీల్లోని వైద్యులు వేళకు రావడం లేదనే ఆరోపణలున్నాయి. అత్తిలి పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్ లేక రేలంగి పీహెచ్సీ నుంచి వారానికి మూడు రోజులు వస్తున్నారు. మంచిలి పీహెచ్సీలో ఫార్మాసిస్ట్ లేక అత్తిలి పీహెచ్సీ నుంచి మూడు రోజులు వస్తున్నారు.
భీమవరం.. సౌకర్యాలు గగనం
జిల్లా కేంద్రం భీమవరంలోని ఏరియా ఆస్పత్రిలో జనరల్, బాలింతల వార్డుల్లో తాగడానికి మంచి నీటి సౌకర్యం లేదు. నాలుగు ఏసీలు ఉండగా ఒకటి పనిచేయడం లేదు. టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి. ఎక్స్రే, స్కానింగ్ల్లో ఇద్దరు టెక్నీషియన్లకు ఒక్కరే ఉన్నారు. ఈసీజీ టెక్నీషియన్ లేడు. ఓపీ వద్ద కూర్చునేందుకు సరిగా బల్లలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు.
పాలకొల్లు.. రోగుల ఘొల్లు : పాలకొల్లు ఏరియా ఆస్పత్రిలో సమయానికి వైద్యులు రాకపోవడంతో రోగులు క్యూలైన్లో బారులు తీరి పడిగాపులు కాస్తున్న పరిస్థితి. గర్భిణులు, బాలింతల వార్డు అధ్వానంగా ఉంది. 23 మంది వైద్యులకు 21 మంది వైద్యులు ఉన్నారు. ఎక్స్రే, ఈసీజీలు ఉన్నా స్కానింగ్ కోసం బయటకు వెళ్లాల్సిందే. కొందరు వైద్యులు సెలవుపై వెళ్లడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
తాడేపల్లిగూడెం.. మందుల కొరత
తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో మందుల కొ రత తీవ్రంగా ఉంది. స్కానింగ్లు బయటకు రాస్తున్నారు. దంత వైద్యానికి వచ్చే వారికి పళ్లు చెక్ చేయడానికి సరైన పరికరాలు లేవు. వెంకట్రామన్నగూ డెం, మాధవరం పీహెచ్సీల్లో ల్యాబ్ టెక్నీషియన్లు వారానికి మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. పెంటపాడు మండలంలో షుగర్, బీపీ మాత్రలు అందుబాటులో ఉండటం లేదు. నాలుగు నెలలుగా 104 ద్వారా సరఫరా నిలిచిపోయినట్టు రోగులు చెబుతున్నారు.
నరసాపురం.. సిబ్బంది లేమి
నరసాపురం పట్టణంలోని రెండు పీహెచ్సీల్లో అసౌకర్యాలు వెంటాడుతుండటంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రూరల్లోని ఎల్బీచర్ల, తూర్పుతాళ్లు పీహెచ్సీల్లో పార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. మొగల్తూరు పీహెచ్సీలో 19 మంది ఏఎన్ ఎంలకు 12 మంది మాత్రమే ఉన్నారు. ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గర్భి ణులకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాల్సిన స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఉండి.. సమస్యలు దండి
ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు సీహెచ్సీలో షు గర్ మాత్రలు, ఇన్సులిన్ కొరత ఎక్కువగా ఉంది. సీహెచ్సీతో పాటు పెదకాపవరం, ఉండి, యండగండి పీహెచ్సీల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. పాలకోడేరు పీహెచ్సీకి అధిక సంఖ్యలో రోగులు రాగా ఇద్దరు వైద్యులకు ఒక్కరే విధులకు హాజరయ్యారు. దీంతో గర్భిణులు, రోగులు వేచి ఉండాల్సి వచ్చింది.
ఆచంట.. క్షీణించిన పారిశుద్ధ్యం
ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ సీహెచ్సీలో పారిశుద్ధ్యం లోపించింది. సీహెచ్సీ చుట్టూ రోడ్డు సరిగాలేక బురదమయంగా మారడంతో రాకపోకలకు రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో లేని మందులను బయటి నుంచి తెప్పించి ఇస్తుండటంతో అప్పటివరకు రోగులు వేచి ఉండాల్సి వస్తుంది. జనరల్ మెడిసిన్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ సిబ్బంది కొరతతో మిగిలిన వైద్య సిబ్బందిపై పనిభారం పడుతోంది.
ఆస్పత్రులకు సుస్తీ
వేళకు విధులకు హాజరు కాని వైద్యులు
పూర్తిస్థాయిలో సరఫరా అవ్వని మందులు
సేవల కోసం రోగుల పడిగాపులు
ఓపీ నమోదుకు తప్పని తిప్పలు
వేధిస్తున్న వైద్య సిబ్బంది కొరత
గగనంగా అత్యవసర వైద్యం
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
వైద్యుల కొరత ఇలా..
ఆస్పత్రి మంజూరు పనిచేస్తున్నవారు ఖాళీలు
తణుకు జిల్లా ఆస్పత్రి 34 27 7
నరసాపురం ఏరియా ఆస్పత్రి 23 18 5
పాలకొల్లు ఏరియా ఆస్పత్రి 23 21 2
భీమవరం ఏరియా ఆస్పత్రి 23 18 5
తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి 23 16 7
ఆచంట సీహెచ్సీ 8 6 2
ఆకివీడు సీహెచ్సీ 8 6 2
పెనుగొండ సీహెచ్సీ 8 7 1
ఇన్సులిన్ ఇవ్వడం లేదు
ఆకివీడు సీహెచ్సీలో రెండు నెలల నుంచి సుగర్ మాత్ర ఒక్కటే ఇస్తున్నారు. రెండో మాత్ర లేదంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇన్సులిన్ ఇవ్వడం లేదు. బయట కొనుగోలు చేయాలంటే ఖరీదు ఎక్కువ, ఆర్థిక భారంగా ఉంది. పేదలకు ఇన్సులిన్ అందుబాటులోకి తీసుకురావాలి.
– కె.భాగ్యలక్ష్మి, షుగర్ బాధితురాలు, ఆకివీడు
చాలా ఇబ్బంది పడుతున్నా..
మాది నరసాపురం. నాకు షుగర్. ఉదయం, రాత్రి ఇన్సులిన్ చేసుకోవాలి. నరసాపురం ప్రభుత్వాస్పత్రిలో ఇంజక్షన్ బాటిల్ అడిగితే లేవంటున్నారు. దీంతో పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి వస్తున్నా. ఇంజక్షన్ కోసం మూడు రోజులకోసారి ఇక్కడకు రావడం చాలా ఇబ్బందిగా ఉంది.
– దేవి నాగేశ్వరరావు, షుగర్ బాధితుడు, నరసాపురం
జిల్లాలో ఆస్పత్రులు
జిల్లా ఆస్పత్రి 1
సీహెచ్సీలు 3
ఏరియా ఆస్పత్రి 5
పీహెచ్సీలు 34
యూపీహెచ్సీలు 18
రోజుకు
సగటున ఓపీ 15,285