
గుగాంపునకు మెర్లిన్ అవార్డు
పెనుగొండ: అంతర్జాతీయ ఇంద్రజాలికుడు గుగాంపునకు ప్రతిష్టాత్మకమైన అమెరికన్ మెర్లిన్ అవార్డు వరించింది. ఈ మేరకు డాక్టర్ గుగాంపు వివరాలు వెల్లడించారు. అమెరికాలోని లాస్ వెగాస్లో ఆగస్టు 7న జరిగిన కార్యక్రమంలో మెర్లిన్ అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా దేశవిదేశాల నుంచి ఈ అవార్డుకు 37 మంది అంతర్జాతీయ ఇంద్రజాలికులు ఎంపికయ్యారని తెలిపారు. 2016లో మొదటిసారి ఈ అవార్డు తీసుకున్నట్లు తెలిపారు.
ఆకివీడు: దివ్యాంగులకు రీ–అసెస్మెంట్లో కొత్త సదరం ధ్రువపత్రాలు ఇవ్వకుండా పింఛన్లు తొలగించడం దారుణమని వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అల్లాడి నటరాజు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సదరం ఇచ్చేంతవరకూ పింఛన్లపై జారీ చేసిన నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేంతవరకూ పింఛన్లు మంజూరు చేయాలన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజులు అధిక వర్షాల నేపథ్యంలో నేడు నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేశామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): నిబంధనలకు విరుద్ధంగా పెదవేగి మండలం రామచంద్రపురం జెడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్పై పెదవేగి పాఠశాలకు పంపిన ఎంఈఓ–1పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938 అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామ్మోహన్ రావు, మోహన్ రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రామచంద్రపురం పాఠశాలలో 100 మంది విద్యార్థులకు సోషల్ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు.
ఏలూరు(మెట్రో): రైతులకు ఎరువులు విక్రయించిన తరువాత ఆ వివరాలను ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా అన్నారు. ఆదివారం పెదవేగి, కామవరపుకోట మండలాల్లో ఎరువుల షాపులను తనిఖీ చేశారు. డీలర్లు యూరియా, ఇతర ఎరువులను విక్రయించిన తక్షణమే పోర్టల్లో నమోదు చేయాలన్నారు.