
ఎఫెక్ట్
పారిశుద్ధ్య చర్యలు
పెంటపాడు: గ్రామాల్లో పారిశుద్ధ్య లేమి పేరిట సాక్షిలో ఈ నెల 1న ప్రచురితమైన వార్తకు మండల అధికారులు స్పందించారు. ఎంపీడీవో ఆదేశాల మేరకు కొండేపాడులో శనివారం గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీల్లో సిల్ట్ తీయించారు. చెత్తను జేసీబీల సాయంతో తొలగించారు.
జాయింట్ పట్టా భూముల విభజనకు అవకాశం
భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమ గోదావరి జిల్లాలోని రీసర్వే పూర్తి అయిన గ్రామాలలో వెట్ ల్యాండ్ 2.0 లో జాయింట్ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు, తమ భూములను వ్యక్తిగతంగా విభజించుకొనేందుకు అవకాశం కల్పించారని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భూ విభజన కోసం సాధారణంగా వసూలు చేసే రూ.500 ప్రభుత్వ రుసుంను పూర్తిగా మాఫీ చేసినట్లు తెలిపారు. భూ యజమానులు కేవలం రూ.50 నామమాత్రపు దరఖాస్తు రుసుంను గ్రామ సచివాలయంలో చెల్లించి, వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక అవకాశం ద్వారా జాయింట్ పట్టాదారులు తమ భూములను విభజించుకుని గ్రామ సచివాలయంలో అర్జీ దాఖలు చేసుకుని, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు పొందవచ్చన్నారు.
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
ఉండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను ఽశనివారం ఎన్నార్పీ అగ్రహారం కేవీకేలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు మూడు విడతల్లో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అనంతరం ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రతక్ష్య ప్రసారంలో నాయకులు, రైతులు వీక్షించారు.
నవోదయ ప్రవేశాల దరఖాస్తుకు గడువు పొడిగింపు
భీమవరం: రానున్న విద్యాసంవత్సరంలో జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోడానికి ఆగస్టు 13 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఈ.నారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను పరిపాలన కారణాలు, తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగించినందున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉపాధ్యాయ అవార్డుల నామినేషన్స్కు 8 వరకు గడువు
భీమవరం: గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈనెల 8లోగా నామినేషన్స్ను సంబంధిత ఉప విద్యాశాఖాధికారులకు అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు నీట్ పీజీ పరీక్ష
ఏలూరు (ఆర్ఆర్పేట): వైద్య కళాశాలల్లో వైద్య విద్యలో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నీట్ పరీక్ష ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరగనుంది. ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మంది విద్యార్థులకు, సిద్ధార్థ క్వెస్ట్ విద్యా సంస్థలో 174 మందికి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి 8.30 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను, ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి.
రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్
ఏలూరు (టూటౌన్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఒక్క రూపాయికే ఉచిత సిమ్ అందిస్తుందని టెలికాం జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను తెలిపారు. స్థానిక జిల్లా టెలికాం జీఎం కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత సిమ్తో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్లు, 30 రోజుల కాల వ్యవధితో అందజేస్తున్నట్లు తెలిపారు.

ఎఫెక్ట్