కంగారులో రైలు దిగేసిన జార్ఖండ్ మహిళ
ఏలూరు టౌన్: జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ కంగారులో దెందులూరులో రైలుబండి దిగిపోగా, ఆమెను తిరిగి బంధువులకు అప్పగించినట్లు ఏలూరు రైల్వే ఎస్సై పీ.సైమన్ తెలిపారు. జార్ఖండ్ రాష్ట్రం బిదండి గ్రామానికి చెందిన అనిత ముర్ము అనే మహిళ భర్త రాంలాల్తో కలిసి కేరళ రాష్ట్రానికి పనులు చేసుకునే నిమిత్తం ఈనెల 1వ తేదీన బొకారో ఎక్స్ప్రెస్ రైలులో థన్బాద్ నుంచి ఎర్నాకుళం వెళుతుంది. రైలుబండి దెందులూరు సమీపానికి వచ్చేసరికి భర్త రాంలాల్ కనిపించకపోవడంతో భయంతో అనిత ముర్ము రైలు దిగిపోయింది. ఆమెను గమనించిన రైల్వే సిబ్బంది ఏలూరు రైల్వే పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి అప్పగించారు. అనంతరం రైల్వే ఎస్సై సైమన్ మహిళను వన్స్టాప్ సెంటర్లో ఉంచారు. అనంతరం మహిళ వివరాలు సేకరించి బంధువులను ఏలూరు రప్పించారు. మహిళ భర్త రాంలాల్, అన్నలు ఏలూరు రైల్వే పోలీస్స్టేషన్కు రాగా మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి భర్తకు అప్పగించారు.
నిందితుడిపై మూడు కేసులు
ఆకివీడు : బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిపై మూడు కేసులు నమోదు చేసినట్లు ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు బుధవారం చెప్పారు. కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామన్నారు. గాయాలైన నిందితుడు షేక్ మీరాకు భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామన్నారు. సంతపేట ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
భీమవరం: భీమవరం రెండో పట్టణంలోని ఓ బ్యాంకు ఉద్యోగి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఇజ్రాయేల్ చెప్పారు. వివరాల ప్రకారం వీరవాసరం మండలం తోలేరుకు చెందిన ఎస్.భీమరాజు భీమవరంలో ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఎప్పుటిలానే ఈనెల2న బ్యాంకుకు వెళ్లాడు. మధ్యాహ్నం నుంచి బ్యాంకులో అతని ఆచూకీ లేదు. బుధవారం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


