దళారుల నిలువు దోపిడీ | - | Sakshi
Sakshi News home page

దళారుల నిలువు దోపిడీ

Apr 27 2025 12:54 AM | Updated on Apr 27 2025 12:54 AM

దళారుల నిలువు దోపిడీ

దళారుల నిలువు దోపిడీ

ఏలూరు (మెట్రో): జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులను దళారులు నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో.. మద్దతు ధర లభించకపోవడంతో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ప్రకృతి కరుణించడంతో దిగుబడులు బాగానే వచ్చినా.. కూటమి సర్కారు రైతులపై కక్ష కట్టింది. జిల్లాలో ఎక్కువగా మెట్టప్రాంతం ఉండటంతో ప్రస్తుత సీజన్‌లో రెండో పంటగా రైతులు 48,878 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ప్రస్తుతం దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందపడ్డారు. ప్రకృతి కనికరించడంతో ఎకరానికి 35 నుండి 40 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది.అయితే మద్దతు ధర లేకపోవడం, దళారులు దోపిడీతో ఆ ఆనందం కాస్తా ఆవిరైంది.

క్వింటాల్‌కు రూ.400 తగ్గింపు

గత వైఎస్సార్‌సీపీ సర్కారు క్వింటాల్‌కు రు.2600 కనీస మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కంటే ఈ ఏడాది కనీస మద్దతు ధర పెరుగుతుందని రైతులు భావించారు. ప్రస్తుతం రూ.2,225కు ధర తగ్గించడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. క్వింటాల్‌కు సుమారు రూ.400 తగ్గించడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎకరం సాగు చేసేందుకు రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకూ ఖర్చవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం ఖర్చులు, పెట్టుబడి పోను ఎకరానికి రూ.20 వేల వరకే మిగులుతుందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఇచ్చిన మద్దతు ధర ఇచ్చినా లాభాలు వచ్చేవని రైతులు అంటున్నారు. గతంలో రైతు భరోసాతో ప్రభుత్వం ఆదుకునేది. రైతులకు కనీస మద్దతు ధర అందించి రైతులు పండించిన పంటను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసేది. నేరుగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా సాయాన్ని అందిస్తూ రైతులను గత ప్రభుత్వం ఆదుకునేది. ప్రస్తుతం మద్దతు ధర లేదు, రైతులకు సాయం లేదు.

బర్డ్‌ఫ్లూ దెబ్బకు తగ్గిన డిమాండ్‌

జిల్లాలో మొక్కజొన్నను 80 శాతం పైగా కోళ్ల ఫారాలకు సరఫరా చేసి మేతగా వినియోగించేవారు. ఇటీవల కోళ్లకు బర్డ్‌ఫ్లూ వ్యాపించడంతో పౌల్ట్రీ రంగం కుదేలైంది. దీంతో కోళ్ల ఫాంలు మూతపడ్డాయి. దీంతో మొక్కజొన్నకు డిమాండ్‌ తగ్గడంతో రైతుల పండించిన పంటను దళారులు తమ ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారు. ఒక వైపు రైతులను ప్రభుత్వం ఆదుకోకపోగా మరో వైపు మద్దతు ధర తగ్గించడం వంటి పరిణామాలతో మొక్కజొన్న రైతు లబోదిబోమంటున్నాడు.

మొక్కజొన్న రైతు గగ్గోలు

మద్దతు ధర తగ్గింపు.. దోచుకుంటున్న దళారులు

జిల్లా వ్యాప్తంగా 48,878 ఎకరాల్లో సాగు

జిల్లాలో మొక్కజొన్న సాగు వివరాలు

జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు: 18,345 మంది

జిల్లాలో సాగు: 48,878 ఎకరాలు

ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర: రూ.2,225

దళారులు కొనుగోలు చేస్తున్న ధర: రూ.2 వేల నుంచి 2,200

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement