
ఉత్సాహంగా రన్ ఫర్ జీసస్
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో శనివారం క్రైస్తవులు నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. స్థానిక పాత బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ వసంతమహల్ సెంటర్, జ్యూట్మిల్లు, ఓవర్బ్రిడ్జి, ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా ఇండోర్ స్టేడియం వద్దకు చేరింది. ముఖ్య అతిథులుగా ఐసీఎం సంఘాల అగ్రపీఠాధిపతి బిషప్ జాన్ ఎస్డీ రాజు, మన్నా చర్చ్ బిషప్ ఎలీషా రాజు హాజరయ్యారు. రన్ ఫర్ జీసస్ క్రైస్తవ సమాజంలో భాగమైపోయిందని, రాబోయే సంవత్సరాల్లోనూ కొనసాగించాలని బిషప్ జాన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం క్రైస్తవుల ఆధ్యాత్మిక జీవితానికి అద్దం పడుతుందని బిషప్ ఎలీషా రాజు అన్నారు. ఇదే క్రమశిక్షణను క్రైస్తవులు నిరంతరం కొనసాగించాలని అమలోధ్బవి కథీడ్రల్ గురువులు ఫాదర్ మైఖేల్ ఇంజమాల అన్నారు. శ్యామ్ బాబు, రాజకుమార్ తదితరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. లూథరన్ సంఘ సీనియర్ గురువులు మిల్టన్, పీపీఎస్ కిరణ్, ఎంఎం కుమార్, యు.విలియమ్ కేరీ, పి.శ్యామ్ పాలీనా తదితరులు సందేశాలు అందించారు. ఫైర్స్టేషన్ సెంటర్లో మానవహారం చేపట్టి డి.యోబు, కె.కిరణ్, జెర్మియా, కె.డేవిడ్ తదితరులు ప్రార్థనలు చేశారు. వందలాది మంది క్రైస్తవులు ర్యాలీలో పాల్గొన్నారు.