పూర్వ వైభవం దక్కేనా!
నాటకాన్ని నిలబెడుతున్న కళాపరిషత్లు
జిల్లాలోని పలు సంస్థలు పరిషత్లు నిర్వ హిస్తూ నాటక రంగాన్ని పోషిస్తున్నాయి. తోలేరుకు చెందిన సుబ్రహ్మణ్యేశ్వర నాటక కళాపరిషత్, వీరవాసరా నికి చెందిన వీరవాసం కళా పరిషత్, భీమవరానికి చెందిన చైతన్య కళాభారతి, కళారంజని కళా పరిషత్లు.. ఏలూరుకు చెందిన హేలాపురి కళాపరిషత్, గరికపాటి కళా పరిషత్, పాలకొల్లు నాటక కళా పరిషత్ సంస్థలు ఏటా నాటక పోటీలు నిర్వహిస్తూ రాష్ట్రంలోని ప్రముఖ సంస్థలకు చెందిన కళాకారులను ఆయా ప్రాంతాలకు ఆహ్వానించి, పోటీలతో పాటు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాయి. 1995లో రాష్ట్ర ప్రభుత్వం నంది నాటకోత్సవాలు ప్రారంభించి నంది అవార్డులను ఇస్తోంది. 2009లో ఖాజావలీ దర్శకత్వంలో ప్రదర్శించిన ఎవరో ఒకరు సాంఘిక నాటకం బంగారు నందితో పాటు 5 కాంస్య నందులు గెలుచుకుంది. ఆ తరువాతి సంవత్సరం వలీ దర్శకత్వంలోనే 2010లో ౖసైసె జోడెడ్ల బండి నాటకానికి బంగారు నందితో పాటు 5 కాంస్య నందులు వరించాయి. 2012లో మహాసాధ్వి శకుంతలకు వెండి, కాంస్య నంది, 2017లో ఇంద్రసింహాసనం పౌరాణిక నాటకానికి బంగారు నందితో పాటు 5 కాంస్య నందులు వచ్చాయి.
● జిల్లాలో నాటకాలకు పెరుగుతున్న ఆదరణ
● నాటకాలతో ప్రజలను చైతన్యపర్చిన ఉమ్మడి పశ్చిమ గోదావరి
● పరిషత్ల నిర్వహణలో నాటక రంగ పోషణ
● నేడు తెలుగు నాటక రంగ దినోత్సవం
ఏలూరు (ఆర్ఆర్పేట): కందుకూరి వీరేశలింగం పంతులు వ్యవహార ధర్మబోధిని నాటకాన్ని రచించి, తొలిసారిగా రంగస్థలంపై ప్రదర్శించిన రోజు కావడంతో ఏటా ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అప్పట్లో టిక్కెట్లు కొని నాటకాలు చూసేవారు. ప్రముఖ కళాకారుల నాటకాలు చూసేందుకు జనం ఎగబడేవారు. అనంతరం సినిమాలు, టీవీలు, ఇటీవలి మొబైల్ ఫోన్లు రావడంతో నాటకాలకు ఆదరణ తగ్గింది. అయినప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక నాటక కళా పరిషత్లు పోటీలు నిర్వహిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తున్నాయి. నాటక రంగానికి ఊపిరులూదే ప్రయత్నం చేస్తున్నాయి.
ఎందరో మహానుభావులు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎందరో నాటక రచయితలు అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందారు. తిరుపతి వేంకట కవుల గురించి పరిచయం అవసరం లేదు. అనేక పౌరాణిక నాటకాలు రచించి నటులు, దర్శకులకు మార్గదర్శకులయ్యారు. మత్స్యపురికి చెందిన కాళ్ళకూరి నారాయణరావు రచించిన చింతామణి ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్నే ఉర్రూతలూగించింది. దెందులూరుకు చెందిన ఎన్ఆర్ నంది రచించిన మరో మొహంజదారో నాటిక ఉర్రూతలూగించింది. ఏలూరుకు చెందిన కోడూరుపాటి సరస్వతి రామారావు రచించిన సాని– సంసారి నాటిక సాంఘిక నాటకాలకు దిక్సూచిగా నిలిచింది. బందా కనకలింగేశ్వర రావు నాటకాల్లో నృత్యాలను, పాటలను ప్రవేశపెట్టి నాటకాలను ప్రజారంజకంగా మలచడంలో కీలకపాత్ర పోషించారు.
నాటక రంగంపై చెరగని ముద్ర
జిల్లాకు చెందిన అనేక మంది నాటక రంగంపై చెరగని ముద్ర వేశారు. పౌరాణిక నాటకాల్లో షణ్ముఖి ఆంజనేయరాజు అగ్రగణ్యుడు. ఆయన పద్యాలు అందుకుంటే ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యేవారు. తాడేపల్లిగూడెంకు చెందిన మద్దాల రామారావు నాటక రంగంపై తనదైన ముద్ర వేశారు. అనేక మంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కళాకారులు నాటకరంగాన్ని ఒక ఊపు ఊపారు.
సాంఘిక నాటకంపై తాళాబత్తుల ముద్ర
పాలకొల్లుకు చెందిన తాళాబత్తుల వెంకటేశ్వర రావు సాంఘిక నాటక రంగంలో గుర్తింపు పొందారు. ఉపాధ్యా యుడిగా పని చేస్తున్నప్పటికీ నాటక రంగంపై మక్కువతో అనేక నాటకాలు రచించడంతో పాటు నటుడిగా రాణిస్తున్నారు. ఆయన రచించిన సైకత శిల్పం, నాన్నా నేనొచ్చేసా, అనూహ్యం, తప్పుటడుగులు, సప్త పది, దిష్టిబొమ్మలు, నాన్నా నన్ను క్షమించండి, మనిషికీ మనిషికీ మధ్య వంటి సంచలన విజయాలు అందుకున్నాయి.
ప్రభుత్వం ఆదరించాలి
మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో నాటక రంగానికి ఆదరణ తగ్గుతోంది. కరోనా అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 కొత్త పరిషత్లు వచ్చాయి. నేటి తరంలో నాటకరంగంపై ఆసక్తి కలిగించడానికి ప్రాథమిక విద్యలో నాటకరంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. దేవాలయాల్లో నిర్వహించే ఉత్సవాల్లో నాటకాలను ప్రదర్శించేలా ప్రోత్సహించాలి. నాటక రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది.
– బుద్దాల వెంకట రామారావు, బీవీఆర్ కళాక్షేత్రం అధినేత, తాడేపల్లిగూడెం
పూర్వ వైభవం దక్కేనా!
పూర్వ వైభవం దక్కేనా!
పూర్వ వైభవం దక్కేనా!


