పేదల నెత్తిన ధరల బండ
సాక్షి, భీమవరం: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న నిత్యావసరాల ధరల చెంతన వంట గ్యాస్ చేరింది. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో మంగళవారం నుంచి సిలిండర్ ధర రూ.50 పెరిగి మంటలు పుట్టిస్తోంది. ఎన్డీఏ సర్కారు పెంచిన ధరతో జిల్లాలోని వినియోగదారులపై ఏడాదికి రూ.21.76 కోట్ల అదనపు భారం పడుతోంది. జిల్లాలో ఐఓసీకి చెందిన 20 గ్యాస్ ఏజన్సీలు ఉండగా హెచ్పీసీ ఏజెన్సీలు 18, బీపీసీ ఏజెన్సీలు నాలుగు ఉన్నాయి. వీటి పరిధిలో 6,21,626 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నిన్నటి వరకు 14.20 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.830గా ఉంది. వంట గ్యాస్పై మంగళవారం నుంచి రూ.50 పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. జనరల్ కనెక్షన్లతో పాటు ఉజ్వల కనెక్షన్లకు ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు సిలిండర్ ధర రూ.880కు పెరిగింది. సగటున ఒక్కో కుటుంబం ఏడాదికి ఏడు సిలెండర్ల చొప్పున వాడుతోంది. జిల్లాలోని వినియోగదారులు 43.51 లక్షల డొమెస్టిక్ సిలెండర్లు వినియోగిస్తున్నట్టు అంచనా. వంట గ్యాస్ కోసం ఇంతవరకు ఏడాదికి రూ.5810 వెచ్చిస్తే, ప్రస్తుత ధర ప్రకారం రూ.6,160 చెల్లించాలి. పెరిగిన ధరల ప్రకారం జిల్లా వాసులపై రూ.21.76 కోట్ల అదనపు భారం పడుతోంది.
పేదింట ధరల మంట : మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కిలో కందిపప్పు రూ.150గా ఉంటే పెసరపప్పు రూ.130, మినపప్పు రూ.110గా ఉంది. మరోపక్క పామాయిల్ ప్యాకెట్ రూ.140 ఉండగా, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.150గా ఉంది. జనవరిలో రూ.120 ఉన్న పామాయిల్ ఫిబ్రవరిలో రూ.20 పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఇతర నూనెలు, సరుకుల ధరలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం రేషన్ కందిపప్పు సరఫరా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. రెండు నెలలుగా సరఫరా నిలిపివేయడంతో అధిక ధరలకు బయటి మార్కెట్లోనే కొనుగోలు చేయాల్సి వస్తోంది. సంక్షేమ పథకాల అమలును గాలికొది లేసిన ప్రభుత్వం, ధరల నియంత్రణకు చర్యలు చేపట్టకపోవడంతో పేదవర్గాల జీవనం దుర్భరంగా మారింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు తాజాగా వంటగ్యాస్ ధర పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. సిలిండర్పై కేంద్రం ఇస్తున్న సబ్సిడీ రూ.10 మాత్రమే. పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని వివిధ వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రూ.50 పెరిగిన గ్యాస్ ధర
జిల్లాలో 42 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 6,21,626 కనెక్షన్లు
జిల్లా వాసులపై రూ.21.76 కోట్ల అదనపు భారం
ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ఇక్కట్లు
గ్యాస్ ధర పెంపు సరికాదు
కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో వంట గ్యాస్ ధరలు పెంచడం సరికాదు. దీనివలన ప్రజలపై మరింత భారం పడుతుంది.
– కొల్లి రత్నకుమారి, గృహిణి, ఉండి
పెంచిన ధరను తగ్గించాలి
పేదవాడిపై భారం పడకుండా నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు ఇష్టానుసారంగా అన్ని ధరలూ పెంచేస్తున్నారు. పెంచిన ధరలను తగ్గించి పేదవర్గాల వారిని ఆదుకోవాలి.
– చాలంటి సజన, ఎన్ఆర్పీ అగ్రహారం
పేదల నెత్తిన ధరల బండ
పేదల నెత్తిన ధరల బండ


