అక్రమ పీడీ యాక్టు సిగ్గుచేటు
భీమవరం : ప్రశ్నించే గొంతులపై పీడి యాక్ట్లను, రౌడీషీట్లను ప్రయోగిస్తున్న కూటమి ప్రభుత్వం పునరాలోచించాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని రైతు సంఘం రాష్ట్ర నేత బి.బలరాం హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ యాక్ట్ రద్దు చేసి వెంటనే విడుదల చేయాలను కోరుతూ సీఐటీయూ, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశంచౌక్లో సోమవారం నిరసన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ నక్కపల్లి ప్రాంతంలో భూముల కోసం పోరాటం చేస్తున్న అప్పలరాజు ప్రజలకు అండగా నిలవడం నేరమా అని ప్రశ్నించారు. గంజాయి, మద్యం, ఇసుక మాఫియా లాంటి వారిపై పెట్టాల్సిన కేసులు ప్రజలకు అండగా నిలిచే వారిపై పెట్టడం ఏంటని మండిపడ్డారు. ఏజెన్సీ ఏరియాలో బుట్టాయగూడెం మండలంలో గిరిజనుల భూముల్లో వేసుకున్న పంటలను ట్రాక్టర్లతో దున్ని నాశనం చేయడమే కాకుండా గిరిజను లు, నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన విధంగా ఉందన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.వాసుదేవరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, వృత్తి సంఘాల జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, మామిడిశెట్టి రామాంజనేయులు, ఎం.ఆంజనేయులు, ఎం.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.


