హన్మకొండ అర్బన్: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియనన్ పిలుపు మేరకు శుక్రవారం గ్రేటర్ నగరంలో బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున సమ్మె చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో ఆందోళనలో పాల్గొన్నారు. వరంగల్ ఎస్బీఐ ప్రధాన శాఖ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు పాల్గొని తమ ఐక్యతను, పోరాట స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో ఎస్బీఐ అధికారుల సంఘం డీజీఎస్ వై.ప్రవీణ్కుమార్, అవార్డు స్టాఫ్ డీజీఎస్ సీహెచ్.సంతోశ్కుమార్, ఓబీసీ డీజీఎస్ రజనీకాంత్, సేవా డీజీఎస్ రమణతో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.
సమ్మె ఎఫెక్ట్
బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో శుక్రవారం బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. బ్యాంకు శాఖల్లో నగదు ఉపసంహరణ, డిపాజిట్లు, ఇతర లావాదేవీల కోసం వచ్చిన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఏటీఎంలు కూడా అందుబాటులో లేకపోవడంతో అత్యవసర నగదు అవసరాలకు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీనికితోడు శని, ఆది, సోమవారం వరుసగా సెలవులు రావడంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో నగదు లావాదేవీలు, ఇతర బ్యాంకింగ్ అవసరాల కోసం ప్రజలు మరికొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.


