వర్ధన్నపేట: ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ధ్వజమెత్తారు. పట్టణంలో వివేకానంద విగ్రహం నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు బుధవారం 420 ఫీట్ల భారీ ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఇంటింటికి కాంగ్రెస్ బాకీకార్డులను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద మానవహారం, రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ధర్నా ముగించాలని పోలీసులు కోరగా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. పోరాటాలు బీఆర్ఎస్కు కొత్త కాదని, పోలీసులతో ఇబ్బందులకు గురిచేసినా, అరెస్టు చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకూ ప్రభుత్వం వెంటపడతామని స్పష్టం చేశారు. 420 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు గడిచినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని సంక్షేమ పథకాలు ప్రస్తుతం నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. తాము అధికారంలో ఉండగా 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే స్థానిక ఎమ్మెల్యే 30 పడకల ఆస్పత్రిగా డౌన్గ్రేడ్ చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, నాయకులు పూజారి రఘు, తుమ్మల శ్రీధర్, కౌన్సిలర్లు గుజ్జ వీరన్న, సిలివేరు కుమారస్వామి, తిరుపతి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే
అరూరి రమేశ్
పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి
నిరసన.. బాకీ కార్డుల పంపిణీ


