● ఇద్దరి మృతితో పరకాలలో విషాదం
పరకాల: పట్టణంలో మూడు సంవత్సరాల కిత్రం తండ్రి, ఇప్పడు కొడుకు మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. పరకాలలోని 14వ వార్డుకు చెందిన రాగుల రాజు (28) ఓ దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి ఆండాలు కూలి పనులకు వెళ్తోంది. ఈక్రమంలో రాజు అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యాడు. పేద కుటుంబం కావడంతో కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. దీంతో ఇంట్లోనే శనివారం ఆయన మృతిచెందాడు. కాగా, మూడు సంవత్సరాల క్రితం రాజు తండ్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ కుప్పకూలి చనిపోయాడు. నాడు భర్త, నేడు కొడుకు మృతితో ఆండాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. రాజు అంత్యక్రియలు చేయడానికి ఆమె వద్ద డబ్బులు లేవు. నాలుగో వార్డు కౌన్సిలర్ కొక్కిరాల దీప్తి భర్త బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్రావు ముందుకు వచ్చి దహన సంస్కారాలు నిర్వహించే బాధ్యత తీసుకున్నారు. శ్మశానవాటిక వరకు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయించారు.


