రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం
నల్లబెల్లి: రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజాప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మూడుచెక్కలపల్లి లింక్ మెయిన్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి దేవాదుల ప్రాజెక్టు పైపులైన్ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదలతో కుదేలవుతున్న వ్యవసాయ రంగానికి దేవాదుల జలాలు కొత్త ఊపిరినిస్తాయన్నారు. ప్రస్తుత రబీ సీజన్లో సుమారు 5 వేల ఎకరాలకు ఈనీరు అందుతుందని పేర్కొన్నారు. మండలంలోని చెరువులు జలకళ తంతరించుకుంటాయని హర్షం వ్యక్తం చేశారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ద్వారా దేవాదుల ప్రాజెక్టును చేపట్టి రంగాయ, పాకాల చెరువులకు నీరు అందించే ప్రక్రియ ప్రారంభించారని గుర్తు చేశారు. రంగాయ చెరువు పనుల కోసం రూ.311 కోట్లతో అప్పట్లోనే అనుమతులు మంజూరయ్యాయని, గత పాలకులు నిర్లక్ష్యం వ్యవహరించడంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయయని విమర్శించారు. ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వంలో ఈ పనుల్లో వేగం పెరిగిందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి 80 శాతం పనులు పూర్తిచేస్తామని, మిగిలిన పనులు వచ్చే యాసంగి వరకు పూర్తి చేసి నల్లబెల్లి, దుగ్గొండి, నర్సంపేట మండలాల్లోని 32,500 ఎకరాలకు సాగునీరు అందిస్తామని రైతులకు భరోసా కల్పించారు. నీటి సరఫరాలో ఎలాంటి సాంకేతిక ఆటంకాలు కలగకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ కుమారస్వామి, ఎస్ఈ స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఈఈఈలు నారాయణ, సుదర్శన్, డీఈ యశ్వంత్, తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఏఈ జాన్సీరాణి, సర్పంచ్ ఎరుకల లలిత రఘు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి, నాయకులు వైనాల అశోక్, ఎర్రబెల్లి రఘుపతిరావు, మాలోత్ రమేశ్, జిల్లా మునేందర్, మాలోత్ చరణ్సింగ్, భూక్య భాస్కర్ పాల్గొన్నారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
మూడుచెక్కలపల్లిలో
దేవాదుల నీటి విడుదల


