సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలకు మహర్దశ.. అన్నారంషరీఫ్‌ దర్గాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు | - | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌తోనే ఆలయాలకు మహర్దశ.. అన్నారంషరీఫ్‌ దర్గాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

Jun 22 2023 1:04 AM | Updated on Jun 22 2023 12:33 PM

అన్నారం దర్గాలో ప్రార్థనలు చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు - Sakshi

అన్నారం దర్గాలో ప్రార్థనలు చేస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పర్వతగిరి: సమైక్య పాలనలో ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థన మందిరాలు స్వరాష్ట్రంలో పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. అన్నారంషరీఫ్‌లోని హజ్రత్‌సయ్యద్‌ యాకూబ్‌షావలీ దర్గాలో మంత్రి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ వేర్వేరుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు.

గతంలో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలు, కవులు, కళాకారులకు స్వరాష్ట్రంలో తగిన గౌరవం, గుర్తింపు దక్కిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకాన్ని వర్తింపజేస్తూ వెలుగులు నింపుతున్నారని, ఈ పథకం ద్వారా ఆలయ అర్చకులకు రూ.6 వేల నుంచి రూ.10 వేల గౌరవ వేతనం పెంచారని వివరించారు. ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని 36 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు. ఎంపీపీ లూనావత్‌ కమలపంతులు, జెడ్పీటీసీ సింగ్‌లాల్‌ పాల్గొన్నారు.

పరిఢవిల్లుతున్న ఆధ్యాత్మిక శోభ
తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని కల్లెడ, బూర్గుమల్ల గ్రామాల మధ్య స్వయంభూ భైరవ సమేత ఆంజనేయ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి రమేష్‌తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు.

ఆలయానికి కర్నాటకకు చెందిన మనోజ్‌రావు రూ.10 లక్షల విరాళం అందించనున్నట్లు ఆర్డీఎఫ్‌ అధినేత ఎర్రబెల్లి రామ్మోహన్‌రావు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ లూనావత్‌ కమలపంతులు, జెడ్పీటీసీ సింగ్‌లాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మోటపోతుల మనోజ్‌గౌడ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ రతన్‌రావు, ఏకాంతంగౌడ్‌, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ జితేందర్‌రెడ్డి, బూర్గుమల్ల సర్పంచ్‌ ఏడుదొడ్ల ఇందిరాజితేందర్‌రెడ్డి, కల్లెడ సర్పంచ్‌ కొంపెల్లి శోభాపరమేశ్వర్‌, వైస్‌ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement