నేడు కొండగిరి సాయినాథ ఆలయంలో పూజలు | - | Sakshi
Sakshi News home page

నేడు కొండగిరి సాయినాథ ఆలయంలో పూజలు

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

గీసుకొండ: గీసుకొండ మండలం కోటగండి వద్ద వరంగల్‌–నర్సంపేట రహదారి పక్కన నిర్మించిన కొండగిరి సాయినాథ ఆలయం భక్తులను అలరిస్తోంది. కోట మైసమ్మ ఆలయం వెనక భాగంలో కొండా దంపతులు స్వంత ఖర్చుతో ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రాంగణం విశాలంగా ఉండి పచ్చదనంతో భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ప్రతీ రోజు కోటమైసమ్మ, సాయి బాబాకు మొక్కులు చెల్లించడానికి భక్తులు తరలి వస్తుండటంతో ఈ ప్రాంతం ప్రముఖ భక్తి కేంద్రంగా మారింది. కాగా నేడు (బుధవారం) గురుపూర్ణిమ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. బాబాను ప్రత్యక్ష దైవంగా, గురువుగా భావించి గురుపూర్ణిమ పండుగ రోజు పూజిస్తారు.

అన్నారం దర్గా

హుండీ లెక్కింపు

పర్వతగిరి: మండలంలోని అన్నారం షరీఫ్‌ హజ్రత్‌ సయ్యద్‌ యాకుబ్‌ షావలి దర్గా హుండీ లెక్కింపు మంగళవారం వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా వక్ఫ్‌బోర్డ్‌ ఇన్‌స్పెక్టర్‌ రియాజ్‌ మాట్లాడుతూ 2025 నవంబర్‌ 13 నుంచి జూలై 28వ తేదీ వరకు హుండీలో భక్తులు వేసిన కానుకలను లెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు అసిస్టెంట్‌ సెక్రటరీలు మన్సూర్‌అలీ, ఫారుక్‌ హుస్సేన్‌, అమీన్‌ అహ్మద్‌, ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ జలీల్‌, అఖిల్‌, వరంగల్‌ ఇన్స్‌పెక్టర్‌ రియాజ్‌, దర్గా సిబ్బంది ఎస్‌కె.ఆజాద్‌, ఎస్‌కె.ఫిరోజ్‌, జక్కుల దర్గయ్య, సర్పంచ్‌ గాడిపెల్లి మహేందర్‌, అధికారులు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు.

నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహానగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్న ఆదేశించారు. మంగళవారం నగరంలోని పార్కులు, సెంట్రల్‌ మీడియన్లు, నర్సరీలు, గ్రాండ్‌ ఎంట్రెన్స్‌ల వద్ద చేపడుతున్న సుందరీకరణ పనులను కమిషనర్‌ తనిఖీ చేశారు. హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌ను సందర్శించి మొక్కల నిర్వహణ తీరును పరిశీలించారు. ఎల్లాపూర్‌లో జీడబ్ల్యూఎంసీ నర్సరీని సందర్శించారు. ఎల్లాపూర్‌లో కరీంనగర్‌ గ్రాండ్‌ ఎంట్రెన్స్‌ పనులు అడిగి తెలుసుకున్నారు. హసన్‌పర్తి యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ) కేంద్రం వద్ద గ్రీనరీ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, ఈఈ రవికుమార్‌, ఏఈ వరుణ్‌, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా టౌన్‌ ప్లానింగ్‌, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(డీఆర్‌ఎఫ్‌), జీడబ్ల్యూఎంసీ సిబ్బంది సంయుక్తంగా చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్‌ను కమిషనర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరలో అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బిల్‌బోర్డులను ఈనెల 15లోగా తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలు, గోడలపై వాల్‌రైటింగ్స్‌, పోస్టర్లు, పెయింటింగ్‌లను తొలగించి, వాటి స్థానంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ప థకాలను ప్రతిబింబించే ఆకర్షణీయమైన వాల్‌ పెయింటింగ్‌ వేయనున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు.

మోడల్‌ స్కూళ్లలోని

సమస్యలు పరిష్కరించాలి

నర్సంపేట: మోడల్‌ స్కూళ్లలోని సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పైసా గణేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని మోడల్‌ స్కూల్‌ను మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు పసునూరి రవీందర్‌ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా గణేశ్‌ మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని మోడల్‌ స్కూల్‌లో ఇప్పటికీ యూనిఫామ్స్‌ ఇవ్వలేదన్నారు. అన్నంలో రాళ్లు, పురుగులు వస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా జిల్లాలోని అన్ని మోడల్‌ స్కూళ్లలో పూర్తిస్థాయిలో యూనిఫామ్స్‌ ఇవ్వడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్‌, కార్తీక్‌, ఈశ్వర్‌, నాని, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement