పర్వతగిరి: ప్రత్యామ్నాయ పంటలు, నీటి సంరక్షణ పద్ధతులపై రైతులు అవగాహన కలిగి ఉండాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సత్యశారదతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఎల్నినో, వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాల పై సంబంధిత అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది వంటి ఆరతడి పంటలను సాగుచేయాలన్నారు. భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సరైన సమాచారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటలు పండ్లు, కూరగాయలు, ఆయిల్పామ్ పంటల సాగును పెంచేలా ఉద్యానశాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వ్యవసాయశాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షురాలు సావిత్రి, జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావు, సర్పంచ్ శంకర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, పర్వతగిరి గ్రామశాఖ అధ్యక్షుడు కుసం రామచందర్, భిక్షపతి, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
ఆశ్రమ పాఠశాలను సందర్శన
పర్వతగిరి మండలకేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలను ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, కలెక్టర్ సత్యశారద మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి, తాగునీరు, పరిశుభ్రత, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించారు. హాస్టల్లో హాజరు పట్టికను పరిశీలించి విధులకు హాజరు కాని సిబ్బందిపై మండిపడ్డారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను తెలుసుకున్నారు. హాస్టల్లోని 150 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే దుప్పట్లు పంపిణీ చేశారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు


