ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితం గడపాల్సిన వయసులోనూ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేస్తూ తన సేవలను కొనసాగిస్తున్నారు. 38 ఏళ్లపాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మంగళగిరి నర్సోజి.. నేటికీ వారంలో రెండు రోజులు ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. రాజాపూర్, బాలానగర్ మండలాల్లో పనిచేసిన నర్సోజి విద్యార్థుల్లో సైన్స్, గణితంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. లోకాస్ట్, నోకాస్ట్ మెటీరియల్తో వివిధ ఉపకరణాలు తయారు చేసి చంద్రయాన్–3పై అవగాహన కల్పించారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, దక్షిణ భారత సైన్స్ ఫెయిర్లలో వీటిని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఓజోన్ పొర ప్రాముఖ్యతపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన సొంత ఖర్చులతో బహుమతులు, అభ్యసన సామగ్రి ని అందిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన 2026 సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్లో చంద్రయాన్–3 మోడల్ను ప్రదర్శించి ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.
బోధనతో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ.. పరిశోధనతో కొత్త ఆలోచనలకు బాటలు వేస్తున్న పాలమూరు యూనివర్సిటీ కామర్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ రాజ్కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపిక చేసింది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు వివిధ అంశాల పై పరిశోధనలు, జాతీయ–అంతర్జాతీయ సెమినార్ల నిర్వహణలో ఆయన చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థుల్లో కామర్స్పై ఆసక్తి పెంచేందుకు పోటీలు, అకడమిక్ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పరిశోధన పట్ల కూడా ప్రోత్స హించారు. ఆయన పరిశోధనా పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. అధ్యాపక బాధ్యతలతో పాటు యూనివర్సిటీ పరిపాలనలోనూ కీలకంగా వ్యవహరించిన రాజ్కుమార్.. ప్రిన్సిపా ల్, అదనపు కంట్రోలర్, కంట్రోలర్, ఐక్యూఏసీ డైరెక్టర్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు. బోధన, పరిశోధన, పరిపాలన లో అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది.


