మదనాపురం: గ్రామపంచాయతీల అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) ప్రకారం జిల్లాలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రణాళికతో చేపట్టి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం మండలంలోని నర్సింగాపూర్లో పర్యటించి ఫాంపాండ్ నిర్మాణానికి గుర్తించిన స్థలం, మార్కింగ్ ప్రక్రియను పరిశీలించి భూమిపూజ చేశారు. పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను రూపొందించి ప్రజలకు ఉపయోగపడేలా సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రతి పనిలో నాణ్యతతో పాటు పారదర్శకత పాటించాలని, ప్రభుత్వ లక్ష్య సాధనకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ యాదయ్య, డీపీఓ రఘునాథ్, ఎంపీడీఓ, సర్పంచ్, సెర్ప్ ఏపీఎం, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు ఉన్నారు.


