వనపర్తి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను నమ్ముకొని రైతులు పూర్తిగా వరి సాగుపైనే ఆధారపడకుండా పంటమార్పిడిని ప్రోత్సహించాలని, క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని రైతులు వరి సాగుపై మొగ్గు చూపినా.. రానున్న వాస్తవ పరిస్థితులను వారికి వివరించి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మళ్లించేలా మండల వ్యవసాయ అధికారులు కృషి చేయాలన్నారు. జూరాల ప్రాజెక్టు నిండటంతో కేవలం 10 శాతం ఆయకట్టుకు మాత్రమే సాగునీటి లభ్యత ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరికి బదులు వేరుశనగ, ఆయిల్పాం, ఉల్లి, కూరగాయలు, కంది, మినుము తదితర పంటలు సాగు చేసేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో 30 వేల ఎకరాల్లో వేరుశనగ సాగు లక్ష్యంగా నిర్దేశించినందున తప్పనిసరిగా సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసి రోజూ ప్రగతి నివేదికలను సమర్పించాలని కోరారు. ఆయా అంశాలపై ప్రతి వారం సమీక్ష ఉంటుందని.. లక్ష్య సాధనలో నిర్లక్ష్యం సరికాదని హెచ్చరించారు. అదేవిధంగా ప్రతి మండలంలో ప్రత్యామ్నాయ పంటల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ వివరాల ఆధారంగా రైతులకు ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ఏఐ వాయిస్ అసిస్టెంట్ ద్వారా ఫోన్కాల్స్ పంపించనున్నట్లు వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఉద్యాన అధికారి విజయభాస్కర్, ఎంఏఓలు పాల్గొన్నారు.


