వనపర్తి: మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి దిశగా యువత పయనించాలని ఎస్పీ డా. సునీతారెడ్డి సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రొ. కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బలమైన పునాది వేసిన మహోన్నత వ్యక్తి ప్రొ. జయశంకర్ అని కొనియాడారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, హక్కులు, సమాన అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన మహనీయుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆయన చూపిన అంకితభావం, నిబద్ధత, దూరదృష్టి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. జయశంకర్ ఆశయాలను ఆచరణలో పెట్టి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునంద, సీఐ సుగంధ రత్నం, ిసీసీఎస్ సీఐ అశోక్కుమార్, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, రిజర్వ్ ఎస్ఐ వినోద్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో శుక్రవారం నుంచి రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి మహబూబ్గర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.మన్మోహన్రావు, వెంకట్రామిరెడ్డి గురువారం ఒక ప్రటనలో తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయని.. ఈ పోటీల్లో ఇదివరకు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారులు సైతం పాల్గొంటారని పేర్కొన్నారు. విజేతలు సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో జరిగే 72వ జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని వివరించారు.
‘కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతాం’
పాన్గల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేసేందుకు సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధానకార్యదర్శి వంక గోపాల్, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యురాలు కళావతమ్మ తెలిపారు. సీపీఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం గురువారం తెల్లరాళ్లపల్లి నుంచి వారు పాదయాత్ర ప్రారంభించి కేతేపల్లి, వెంగళాయిపల్లి, బండపల్లి, బహుదూర్గూడెం మీదుగా పాన్గల్కు 10 కిలోమీటర్లు పూర్తి చేశారు. వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు, కూలీలు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు.


