బొబ్బిలి: పాత బొబ్బిలి సమీపంలో ఉన్న మోడీ దాబా బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్ని ఆహుతైంది. పట్టణానికి చెందిన మోడీ శ్రీనివాసరావు నిర్వహిస్తున్న దాబా బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైంది. దాబాలో రెల్లిగడ్డితో వేసిన గుడెసెలు ఉండడంతో క్షణాల్లోనే మంటలు అంటుకుని బూడిదైంది. గుర్తు తెలియని వ్యక్తులే దాబాకు నిప్పు పెట్టి ఉంటారని నిర్వాహకులు అనుమానిస్తున్నారు. గురువారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. సీసీ కెమెరాల పుటేజీల్లోని వివరాలతో సంఘటనపై పరిశోధన చేస్తున్నారు. సుమారు రూ.ఐదు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
సిమెంటు బస్తాల మాయంపై విచారణ
పాలకొండ రూరల్: హౌసింగ్ శాఖ ద్వారా గృహ నిర్మాణ లబ్ధిదారులకు అందించాల్సిన సిమెంట్ బస్తాలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గత హౌసింగ్ ఏఈ సుధారాణిపై శాఖా పరమైన విచారణ జరిగింది. సాలూరుకు చెందిన హౌసింగ్ డీఈఈ సోమేశ్వరరావు నేతృత్వంలో గురువారం అధికారులు స్థానిక నగర పంచాయతీ పరిధి భాసూరువారి వీధి సచివాలయంలో హౌసింగ్ రికార్డులు తనిఖీ చేపట్టారు. పట్టణ సచివాలయాల ఎమినిటీ కార్యదర్శులకు తెలియకుండా తమ లాగిన్ల నుంచి తప్పుదారిన సిమెంటు బస్తాలు దారి మళ్లినట్టు అందించిన ఫిర్యాదుతో వారి నుంచి కూడా వివరాలు సేకరించామని డీఈఈ తెలిపారు. తాము గుర్తించిన అంశాలను సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. డీఈఈ వెంట ప్రస్తుత పాలకొండ హౌసింగ్ ఏఈ వినోద్ ఉన్నారు.
విజయనగరం టౌన్: జిల్లాలో గణపతి నవరాత్రులు పురస్కరించుకుని ఉత్సవ కమిటీలు ప్రతీ ఏటా నిర్వహించే ఉత్సవాల నిర్వహణ, మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ ఎఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ నెల 14న నిర్వహించనున్న వినాయక చవితి పండగ సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా చర్యలు చేపట్టామన్నారు. ఉత్సవాల నిర్వహించే వ్యక్తులు ముందుగా ఒక కమిటీగా ఏర్పడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానంతో గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ క్లిక్ చేసి, నిర్దేశించిన అనుమతులు పొందాలన్నారు. సింగిల్ విండో విధానంతో ప్రజలు సులభంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జనానికి అనుమతులు పొందవచ్చన్నారు. మండపాల ఏర్పాటుకు ఎటువంటి చలానాలు చెల్లించనవసరం లేదని స్పష్టం చేశారు. ఆన్లైన్లో పూర్తి చేసిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్ను ప్రింట్ తీసి, లామినేషన్ చేసి, ఉత్సవ మండపంలో తనిఖీలకు వచ్చే అధికారులు పరిశీలించేందుకు అందుబాటులో ఉంచాలన్నారు. ఉత్సవాలను శాంతియుతంగా ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా నిర్వహించుకోవడానికి పోలీసు శాఖకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
రామభద్రపురం: మండల కేంద్రంలోని ఓ వ్యక్తి మద్యానికి బానిసై భార్యతో గొడవలు పడి గడ్డి మందు తాగి గురువారం మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని కనిమెరక వీధికి చెందిన గేదెల రమేష్(39) రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. రోజూ విపరీతంగా మద్యం తాగుతూ భార్య, పిల్లలను పట్టించుకోకపోవడంతో పాటు భార్యతో గొడవలు పడేవాడు. దాంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రమేష్ బుధవారం గడ్డిమందు తాగి ఆత్మహత్యా యత్యానికి పాల్పడ్డాడు. వాంతులు చేసుకుంటుండగా సోదరి కనిమెరక లక్ష్మి గమనించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రధమ చికిత్ప నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. సోదరి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


