రామభద్రపురం: మండల కేంద్రంలోని బొబ్బిలి రూట్లో పెట్రోల్ బంకు వద్ద ఈ నెల 11వ తేదీన లారీని ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం బర్లి గ్రామానికి చెందిన ఇజ్జాడ గౌరీశ్వరి (64) ఇటీవల సాలూరులో తమ బంధువు మృతి చెందిన నేపథ్యంలో 11వ తేదీన పెద్దకర్మ కార్యాక్రమానికి సాలూరు వెళ్లేందుకు బొబ్బిలి వచ్చింది. అక్కడ పార్వతీపురం డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఎక్కింది. సరిగ్గా రామభద్రపురం గ్రామ సమీపంలోని బొబ్బిలి రూట్లో ఉన్న పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌరీశ్వరి తీవ్రగంగా గాయపడింది. వెంటనే స్థానికులు, పోలీసులు కలిసి ప్రధమ చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


