● రూ.రెండున్నర లక్షల ఆస్తి నష్టం
బాడంగి: మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న పంట పొలాల్లో ప్రమాదవశాత్తు గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. లచ్చుపతుల శ్రీరాముకు చెందిన సుమారు రెండెకరాల నిలవరం, బల్జి రమణకు చెందిన 0.25 సెంట్లలో విత్తనానికి ఉంచిన చెరకు కాలిపోయి నష్టం సంభవించినట్టు రైతులు తెలిపారు. సుమారు రూ.రెండు లక్షల వరకు నష్టం జరిగినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎంఆర్ఐ జగదాంబ, వీఆర్ఓ ఆర్వీ రమణమూర్తినాయుడు ప్రమాద స్థలానికి చేరుకొని నష్టాన్ని అంచనా వేశారు. డొంకినవలసలోని అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
మెంటాడ: మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ ఎస్టీ కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో అద్దాల చిన్నమ్మి, అప్పన్న దంపతులకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.85 వేల నగదు, తులమున్నర బంగారు ఆభరణాలు, కొద్ది మొత్తంలో వెండి కాలిపోయాయి. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న నగదు కాలిపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరారు.
విజయనగరం క్రైమ్ : అప్పులిచ్చి అధిక వడ్డీల పేరిట వేధిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. డబ్బులిచ్చి అధిక వడ్డీ వసూలు చేయడం, అప్పు తీసుకున్న వారిని బెదిరించడం ఇచ్చిన అప్పు కంటే అధికంగా అసలుతో పాటు వడ్డీని వసూలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కొందరు బయట వ్యక్తులకు జిల్లాకు వచ్చి అవసరాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి అప్పులిచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తూ ఆర్థికంగా, మానసికంగా వేధిస్తూ వ్యాపారం చేస్తున్నట్టు తమ దృష్టి వచ్చిందని తెలిపారు. డబ్బులిచ్చి బ్లాంక్ ప్రామిసరీ నోటు, బాండ్ పేపరు, తెల్లకాగితం మీద సంతకాలు చేయించుకుంటూ డబ్బులు సకాలంలో ఇవ్వకుంటే కొల్కత్తా, బిహార్ వంటి బయట రాష్ట్రాల కోర్టుల్లో కేసులు వేసి భయపెట్టి భయబ్రాంతులకు గురి చేస్తూ వేధిస్తున్నారని పేర్కొన్నారు. దీన్నే కాల్మనీ వ్యాపారం అంటారని తెలిపారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేయడంతో పాటు రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు.


