● మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు
విజయనగరం రూరల్: భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి, ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య విలువలను తెలియజేసిన ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు జూపూడి ప్రభాకరరావు అన్నారు. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో మంగళవారం నిర్వహించిన జిల్లా దళిత సమ్మేళన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ముందుగా మాలమహానాడు, శ్రీ పైడిమాంబ అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన అంబేడ్కర్ విగ్రహాన్ని జూపూడి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దురలవాట్లు మానుకొని, పిల్లలను చదివించి ఉన్నత విలువలతో పెంచితేనే అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషిచేసినట్లు అవుతుందన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేసి సమాజంలో అసమానతలు, కులబేధాలు లేకుండా మెలగినప్పుడే నిజమైన రాజ్యాంగం అమలు జరిగినట్టుగా భావించాలని పేర్కొన్నారు. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు లోగిశ రామకష్ణ మాట్లాడుతూ జిల్లాలో దళితులపై అంటరానితనం, హత్యాచారాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దళిత సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కల్యాణ్రావు మాట్లాడుతూ ఎస్సీలంతా ఏకమై రాజ్యాధికారం సాధించే దిశగా ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి సియ్యాదుల శ్రీనివాసరావు, ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడు మరువాడ ఈశ్వరరావు, కార్యవర్గ సభ్యులు జూరిరాజు, జిల్లా మాలమహానాడు అధ్యక్షురాలు వర్రి సంతోషి, కార్యదర్శి తాలాడ పైడిరాజు, విజయనగరం జిల్లా నియోజకవర్గం కన్వీనర్ భీమపల్లి సంధ్యారాణి, పైడిమాంబ అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కోరాడ నారాయణరావు, కోరాడ రమణ, బంగార్రాజు, మెట్ట కార్తీక్, కె.సత్యనారాయణ, పొన్నకాయల రామలక్ష్మి, చందక నూకరాజు, చీడి రామకృష్ణ, అక్కివరపు రాజు, తదితరులు పాల్గొన్నారు.


