నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో గడిచిన ఐదు రోజులుగా నిర్వహించిన భూభుజంగ వరాహలక్ష్మీనరసింహస్వామి, మాధవస్వామి వారి వార్షిక కల్యాణోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. వేకువజామున స్వామివారికి ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో పూర్ణాహుతి జరిపారు. అనంతరం స్వామివారి సుదర్శన పెరుమాళ్లను రామకోనేరు ప్రధాన ఘాట్ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి చక్రతీర్థస్నానం నిర్వహించారు. అనంతరం ధ్వజావరోహణ చేపట్టి ఉత్సవాలకు ముగింపు పలికారు.
నేడు ‘గురుదేవా’కు ఒడిశా గవర్నర్ రాక
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామ సమీపంలోని గురుదేవా చారిటబుల్ ట్రస్టును ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు బుధవారం సందర్శంచనున్నట్టు ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేన్సర్ ఆస్పత్రిని, దివ్యాంగులకు ట్రస్టు తరఫున అందిస్తున్న సేవలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.
పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి
జియ్యమ్మవలస (రూరల్): పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి పోలీసులను ఆదేశించారు. చినమేరింగి పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం సందర్శించారు. కేసుల రికార్డులు పరిశీలించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. మండలంలో క్రైమ్ రేటు తగ్గించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ టి.వి.తిరుపతిరావు, ఎస్ఐ అనిషి, తదితరులు పాల్గొన్నారు.
మందకొడిగా వ్యవసాయ రుణాల రెన్యువల్స్
వీరఘట్టం: వీరఘట్టం పీఏసీఎస్లో వ్యవసాయ రుణాలు రెన్యువల్స్ మందకొడిగా సాగుతున్నాయని సీఈఓ బలరాం అన్నారు. మంగళవారం సెలవు రోజు కూడా రైతుల నుంచి రుణాలను వసూలు చేశారు. వీరఘట్టం పీఏసీఎస్ నుంచి రూ.29 కోట్లు రుణాలు ఇవ్వగా రూ.4కోట్లే రెన్యువల్ అయిందన్నారు.


